
ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి
నిజామాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నగరంలోని కంఠేశ్వర్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు ప్రైవేట్ విద్యా సంస్థలు రూ.లక్షల్లో ఫీజులను విద్యార్థుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని, బుక్స్, యూనిఫామ్, షూ, ల్యాబ్, ఈవెంట్స్, సైన్స్ ఫెయిర్ వంటి రకరకాల పేర్లతో ఫీజుల దోపిడీ చేస్తున్నారని, వీటిని నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. ఫీజుల నియంత్రణపై అధ్యయనం చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ‘తెలంగాణ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూలు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు 2025’ పేరిట జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. పేద విద్యార్థులు చదువుకునే ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని కోరారు. అనంతరం పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సమస్యలపై ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పందిస్తూ.. డిమాండ్స్ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. నాయకులు మనోజ్, సాయికిరణ్, రాజు, చరణ్ తేజ, రెడ్డి, వంశీ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ విద్యార్థులకు
మధ్యాహ్న భోజనం అమలు చేయాలి
ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డికి వినతి పత్రం అందజేసిన పీడీఎస్యూ నాయకులు