లోకేశ్వరం: పగలు ఎండలు భగభగ మండిపోతున్నా సాయంత్రం కాగానే మబ్బులు కమ్ముకుంటున్నాయి. కాసేపటికే మేఘాలు మాయమై రైతులను నిరాశకు గురి చేస్తున్నాయి. ఇది వారంరోజులుగా జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి. తొలకరి చినుకులకు గంపెడాశతో పత్తి, సోయా, మొక్కజొన్న, పసుపు విత్తిన రైతులకు నిరాశే మిగిలింది. చినుకు జాడ లేక పురుడు పోసుకున్న మొక్కలు వాడిపోతున్నాయి. రెండుమూడ్రోజుల్లో వర్షం కురవకపోతే ఎండిపోయే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. మరి కొన్నిచోట్ల భూమిలోనే గింజలు డొల్లబారుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


