నిర్మల్
న్యూస్రీల్
పరిమితికి మించి..!
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయపరిమితిని మించి ఖర్చు చేస్తున్నారు. ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని పుర ప్రజలు కోరుతున్నారు.
మైక్రో అబ్జర్వర్లే కీలకం
నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లే అత్యంత కీలకమని అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు శుక్రవారం రెండోవిడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మైక్రో అబ్జర్వర్లకు అదనపు కలెక్టర్ కీలక సూచనలు చేశారు. శిక్షణలో, శిక్షకులు అందించే వివరాలు సమగ్రంగా తెలుసుకుని ఎన్నికల్లో విధుల్లో పాల్గొనాలన్నారు. సిబ్బందికి సమయపాలన క్రమశిక్షణ అత్యంత కీలకమన్నారు. బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించి, ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో డీఈవో భోజన్న, ఎల్డీఎం రామ్గోపాల్, శిక్షకులు పాల్గొన్నారు.
నిర్మల్: ప్రచార రథాలు ఒకదాని వెంట ఒకటి రోజంతా గల్లీలో లొల్లి చేస్తున్నాయి. ఇగ మూడు రోడ్ల కూడళ్ల దగ్గరయితే మూడు వార్డుల నుంచి మూడునాలుగు ఇలాంటి పాటల లొల్లి చేసే పార్టీల బండ్లు రోజంతా తిరుగుతూనే ఉన్నాయి. చెవుల ఇల్లు కట్టుకున్నట్లే పొద్దంతా పాటల వినిపిస్తున్నాయి. చీకటి పడుతుందంటే.. నేతల కార్నర్ మీటింగ్లు మొదలవుతున్నాయి. ఏ గల్లీలను చూసినా పార్టీల జెండాలు, అభ్యర్థుల ఫొటోలతో కలర్ఫుల్ పండుగ వాతావరణం కనిపిస్తోది. ఇక.. పొద్దున టిఫిన్ మొదలు రాత్రి ముక్కసుక్క దాకా అభ్యర్థుల ఇళ్ల దగ్గరే వంటావార్పులు కొనసాగుతున్నాయి.
అటు అన్న.. ఇటు తమ్ముడు
‘అరె ఏమే రాజన్న.. నువ్వేమో పొద్దుగాల లేసిన్నుంచి, రాత్రి బారాబజే దాకా మన పార్టీల తిరుగుతున్నవ్. మీ తమ్ముడేమో ఆళ్ల పార్టీల తిరుగుతున్నడు. మీ గేటుకు ఒకదిక్కు మన స్టిక్కరుంది. ఇంకో దిక్కు గోడకు ఆ పార్టీ రాతలున్నయ్. ఒకటే ఇంట్లకెళ్లి ఒకళ్లు అటు, ఇంకొకళ్లు ఇటు..! ఇదేం కథనే..!?’ అని ప్రచారం చేస్తుండగా సాటి కార్యకర్త రామన్న ఆశ్చర్యంతో అడిగిండు. ‘ఆ.. ఏమున్నదే రామన్న. మావోడు ముందటి నుంచి ఆ పార్టీకే తిరుగుతుండు. ఇగ మన సంగతైతే తెల్సిందే గదనే. నేను పార్టీ పుట్టిన్నుంచి ఇదే జెండా పట్టుకున్న. ఎందరు నాయకులు మారినా.. నేనిండ్లనే ఉన్న కదా. ఓళ్ల ఇష్టం ఆళ్లది..’ అంటూ రాజన్న చెప్పిండు. ఇలా.. ఒకే ఇంట్లో నుంచి రెండుమూడు పార్టీల్లో తిరుగుతున్న వాళ్లూ ఉన్నారు. అభ్యర్థులకు దగ్గర బంధుమిత్రులైతే ఇంటిల్లిపాదీ ప్రచారంలో పాల్గొంటున్నారు.
పొద్దున్నే మొదలు..
పార్టీల ప్రచారం పొద్దున్నే మొదలవుతోంది. ‘అన్నా.. వస్తున్నారా..? ఇవ్వాళ్ల ఆ మిగిలిన రెండు గల్లీలు పూర్తిచేద్దాం తొందరగా రండి అన్న..’ అంటూ అభ్యర్థులు ఫోన్లు చేయడమే ఆలస్యం గుంపులుగుంపులుగా కార్యకర్తలు, అనుచరులు వచ్చేస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం వీధులవారీగా విడిపోయి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకూ ఇలా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పగటిపూట భోజనం, కాస్త విశ్రాంతి తర్వాత మళ్లీ సాయంత్రం యథావిధిగా మరోవైపు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఏదో ఒకపూట పెద్దలీడర్లు, చైర్మన్ బరిలో ఉన్న అభ్యర్థులు గల్లీలవారీగా కౌన్సిలర్ అభ్యర్థులతోపాటు ప్రచారంలో భాగమవుతున్నారు.
రాత్రిళ్లు విందుప్రచారం..
రోజంతా ఇంటింటి ప్రచారం సాగుతుంటే.. రాత్రి నిబంధనల ప్రకారం మైకులు బంద్కాగానే, విందుపార్టీలు ప్రారంభమవుతున్నాయి. వార్డుల్లో గల్లీగల్లీకి ఎక్కడికక్కడ పార్టీనేతలు విందురాజకీయం చేస్తున్నారు. కాలనీల కమిటీలు, కులసంఘాలు, పెద్దలు, యువజనసంఘాలకు వేర్వేరుగా పార్టీలు ఇస్తున్నారు. అక్కడే ఏం చేయాలో, ఎలా పార్టీ అభ్యర్థిని గెలిపించాలో చర్చిస్తున్నారు. ఉదయాన్నే మళ్లీ ఎలా వార్డులో ప్రచారం చేపట్టాలో, ఎవరెవరి దగ్గరకు వెళ్లాలో డిసైడ్ చేసుకుంటున్నారు.
నిర్మల్
నిర్మల్


