బీజేపీని అడ్డుకోవడం ఎంఐఎంతోనే సాధ్యం
నిర్మల్: ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఏ పార్టీ అడ్డుకోలేకపోయిందని, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తాము అడ్డుకుంటామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకేంద్రంలో పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్న పలువార్డుల్లో గురువారం ప్రచారం చేశారు. అనంతరం గాజుల్పేట్లో గంజ్బక్ష్ మైదానంలో నిర్వహించిన సభలో మాట్లాడా రు. నిర్మల్లో గతపాలకులు ఈద్గా పేరిట ముస్లింలను మోసం చేశారని ఆరోపించారు. ఫారెస్ట్ భూమి అంటూ ఈద్గా కాకుండా అడ్డుకున్నారని, అదే భూమిని స్కిల్సెంటర్కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈద్గా కోసం 20 ఎకరాలు కేటాయించాలని నిర్మల్ ఎంఐఎం నేతలతో కలిసి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణరావును కలిశామని విన్నవించారని తెలిపారు. ఎంఐఎం గెలిస్తే స్లాటర్హౌస్ సమస్యనూ పరిష్కరిస్తుందన్నారు. నిర్మల్లో బాలికల కోసం మరో విద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఏ ఒక్కరు కూడా ఓటుహక్కును వృథా చేసుకోవద్దని, ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇందులో పార్టీ పట్టణ అధ్యక్షుడు అజీంబినయహ్యా, ప్రధాన కార్యదర్శి మజర్, కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.


