‘పుర’ బరిలో ఉండుడే..!
చివరిరోజు నామినేషన్ల జాతర
బీఫామ్ ఇవ్వని ప్రధాన పార్టీలు
ఒకే పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు..
నిర్మల్లో పలు వార్డుల్లో రెబల్స్
పట్నం చేరిన భైంసా పంచాయితీ
ఖానాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
నిర్మల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో చివరిరోజైన శుక్రవారం జాతర కొనసాగింది. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీలు బీఫామ్ ఇవ్వకున్నా పార్టీపేరుతో ఒకటి, ఇండిపెండెంట్గా మరొకటి అంటూ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించక పోవడంతో ఎవరు ఏ పార్టీ నుంచి వేస్తున్నారో, ఎవరు బరిలో ఉంటున్నారో స్పష్టత రాలేదు. ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం శుక్రవారం సాయంత్రం డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. నిర్మల్లో ఏపార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. భైంసాలో బీజేపీ టికెట్ల పంచాయితీ హైదరాబాద్ చేరింది.
నామినేషన్లు.. అందరూ వేశారు..
పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోవడం, బీఫామ్లు ఇవ్వకపోవడంతో దాదాపు ఆశావహులందరూ నామినేషన్లు వేశారు. ఎంఐఎం మినహా దాదాపు మూడు ప్రధాన పార్టీల్లో ఒక్కోవార్డు నుంచి కనీసం ఇద్దరు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. ‘ముందయితే నామినేషన్ వేసేద్దాం. బీఫామ్ వస్తే పార్టీ నుంచి లేదంటే ఇండిపెండెంట్గా బరిలో ఉందాం..’ అన్న ధోరణిలో జిల్లా కేంద్రంలోని కొన్నివార్డుల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి ముగ్గురు నలుగురూ వేయడం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడ్డ ఆశావహులు చివరిరోజు బీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ బీఫామ్ ఇస్తామని గ్యారంటీ ఇవ్వడంతో నామినేషన్ వేశారు.
బీఫామ్ ఇచ్చేలోపే..
నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది. ఈలోపే తమ పార్టీ నుంచి తమ వార్డుల్లో రెబల్స్గా నామినేషన్లు వేసిన వారిని తప్పించే సంప్రదింపుల పర్వం మొదలైంది. ‘నీకేం కావాలి చెప్పు.. ఏమిస్తే నాకు మద్దతిస్తవ్..’అనే కోణంలో బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. పార్టీ నేతలతో ఫోన్లు చేయించడం.. లేదంటే గల్లీ పెద్దలను ఇంటికి తీసుకెళ్లి మాట్లాడించడం చేస్తున్నారు. ఒకవేళ పార్టీ తమకే బీఫామ్ ఇచ్చినా ఎన్నికల్లో తమ ఓట్లను రెబల్స్ చీల్చకుండా నామినేషన్లు వేసిన మరుక్షణం నుంచే ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు. చైర్మన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వార్డుల్లోనూ సొంతపార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేశారు. వీరంతా ఈనెల 3లోపే విరమించుకుంటారంటూ ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు.


