క్రీడా మౌలిక సదుపాయాల నిర్వహణలో లోపాలకు సంబంధించిన మరో సంఘటన కలకలం రేపుతోంది. పూణేలోని ఒక మెరైన్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో విషాదం చోటుచేసుకుంది. బాస్కెట్బాల్ బోర్డు ఫ్రేమ్ మీద పడి 20 ఏళ్ల క్యాడెట్ తీవ్ర గాయాలపాలై మరణించాడు.
ఘటన వివరాలు
పూణేలోని టోలానీ మెరైన్ ఇన్స్టిట్యూట్లో సెకండ్ ఇయర్ చదువుతున్న విశాల్ వర్మ, ఆదివారం ఉదయం వ్యాయామం కోసం క్యాంపస్లోని బాస్కెట్బాల్ కోర్టుకు వెళ్లాడు. బాస్కెట్బాల్ హూప్ను పట్టుకుని పుల్-అప్స్ (Pull-ups) తీస్తుండగా, ఒక్కసారిగా ఆ ఇనుప ఫ్రేమ్ మొత్తం అతనిపై కుప్ప కూలిపోయింది.
ఈ ప్రమాదంలో విశాల్ తలకు బలమైన గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు మరియు సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ భారీగా రక్తస్రావం కావడంతో,అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.విశాల్ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాకు చెందినవాడు. 2024లో ఈ ఇన్స్టిట్యూట్లో చేరాడు. అతని బి.టెక్ కోర్సు 2028లో పూర్తి కావాల్సి ఉంది.
ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీత్ కనుంగో ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. అసలు ఆ ఫ్రేమ్ ఎలా కూలిపోయింది అనే దానిపై మేము విచారణ జరుపుతాము" అని ఆయన తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇనుప ఫ్రేమ్ తుప్పు పట్టిపోయిందా? లేదా అమర్చడంలో ఏవైనా లోపాలు ఉన్నాయా? అనే కోణంలో ఇన్స్పెక్టర్ సంతోష్ పాటిల్ విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి : 20 ఏళ్లలో తొలిసారి : ఇరాన్ దెబ్బ , ట్రంప్నకు భారీ షాక్
నిర్వహణలో లోపాలు యువ క్రీడాకారుల ప్రాణాలను బలి అవుతున్నారు. గత ఐదు నెలల్లోనే ఇటువంటి ఘటనలు జరగడం ఇది మూడవసారి. ఇటీవల హర్యానాలోని రోహ్తక్లో 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారుడు హార్దిక్ రాఠీ కూడా ఇలాగే బాస్కెట్బాల్ పోల్ మీద పడటంతో మరణించాడు. అలాగే హర్యానాలోని బహదూర్గఢ్ జిల్లాలో 15 ఏళ్ల బాలుడు కూడా ఇటువంటి ప్రమాదానికే బలైపోయిన సంగతి విదితమే. విషాదంగా మారుతున్న వరుస ప్రమాదాలు దేశంలోని విద్యాసంస్థలు మరియు క్రీడా ప్రాంగణాల్లోని పరికరాల భద్రత ,నిర్వహణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: ఇరాన్ దాడిలో ఎఫ్-35 ఫైటర్ తుస్సు? అసలేంటీ దీని సామర్థ్యం?


