బెంగాల్‌ కిరీటం బీజేపీదే!  | Todays Chanakya predicts BJP flood in West Bengal | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ కిరీటం బీజేపీదే! 

May 1 2026 2:09 AM | Updated on May 1 2026 2:09 AM

Todays Chanakya predicts BJP flood in West Bengal

బీజేపీకి 192  తృణమూల్‌కు 100  ‘టుడేస్‌ చాణక్య’ఎగ్జిట్‌పోల్‌ అంచనా

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ మార్పు నకు ప్రజలు పట్టం కట్టబోతున్నారని ‘టుడేస్‌ చాణక్య’ఎగ్జిట్‌పోల్‌ స్పష్టంచేసింది. బెంగాల్‌ అధికార కిరీటం ఈసారి బీజేపీకి దక్కడం ఖాయమని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 294 ఉండగా మెజార్టీ మార్కు 147 స్థానాలు. బీజేపీ 192కిపైగా స్థానాలు గెల్చుకొని స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టంచేసింది. చాణక్య ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. 

అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ దాదాపు 100 సీట్లు గెల్చుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు తేలింది. ఇతరులు కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతారని చాణక్య తెలియజేసింది. ఈ ఫలితాలు వాస్తవ రూపం దాలిస్తే పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో అది అతిపెద్ద మార్పు అవుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. 15 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధిపత్యానికి తెరపడినట్లేనని అంటున్నారు. బీజేపీకి అనుకూలంగా ప్రజల మద్దతు బలంగా ఏకీకృతం అవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. 

ఇది ఓటర్ల ప్రాధాన్యతలో నిర్ణయాత్మక మార్పును తెలియజేస్తోంది. బెంగాల్‌లో ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్‌ బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. మరికొన్ని ఎగ్జిట్‌పోల్స్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపించాయి. మమతా బెనర్జీ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాబోతున్నట్లు వివరించాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో రెండు కీలకమైన పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం సాగుతుందని పేర్కొన్నాయి. 2021 ఎన్నికల్లోనూ ఇలాంటి పరిణామాన్నే అంచనా వేసినప్పటికీ తృణమూల్‌ కాంగ్రెస్‌కు విజయం దక్కింది. ఆ పార్టీ 215 సీట్లు గెల్చుకుంది. బీజేపీ 77 స్థానాలు మాత్రమే దక్కించుకొని ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది.  

తమిళనాట రెండో స్థానంలో విజయ్‌ పార్టీ  
తమిళనాడులో దళపతి విజయ్‌ నిర్ణయాత్మక శక్తిగా అవతరించబోతున్నట్టు టుడేస్‌ చాణక్య స్పష్టంచేసింది. విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) ఈ ఎన్నికల్లో 30 శాతం ఓట్లతో దాదాపు 63 సీట్లు సాధించబోతున్నట్లు తెలియజేసింది. అధికార డీఎంకేకు 125 స్థానాలు, విపక్ష అన్నాడీఎంకేకు కేవలం 45 స్థానాలు దక్కే వీలున్నట్లు వివరించింది. విజయ్‌ పార్టీ రెండో స్థానంలో నిలవబోతున్నట్లు తెలిపింది. 

సామాజికవర్గాల పరంగా చూస్తే బీసీల్లో 29 శాతం మంది, అత్యంత వెనుకబడిన వర్గాల్లో 27 శాతం మంది, ఎస్సీలు, క్రైస్తవుల్లో 34 శాతం మంది విజయ్‌ పార్టీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ముస్లింలు మాత్రం అధికార డీఎంకేకు మద్దతు పలికినట్లు స్పష్టమవుతోంది. యువతలో టీవీకేకు అమితాదరణ కనిపించింది. 30 ఏళ్లలోపు ఓటర్లు, ప్రధానంగా తొలిసారి ఓటు వేసినవారు, విద్యార్థులు నిరుద్యోగులు దళపతి పార్టీకి జైకొట్టారు. మరోవైపు మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్‌ మళ్లీ డీఎంకే గెలుపు ఖాయమని తెలియజేశాయి. ‘యాక్సిస్‌ మై ఇండియా’మాత్రమే విజయ్‌ పార్టీ జయకేతనం ఎగురవేయబోతున్నట్లు తేల్చిచెప్పింది. 

కేరళలో యూడీఎఫ్‌కు విజయావకాశాలు 
కేరళలో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్‌ మధ్యగట్టి పోటీ నెలకొన్నట్లు టుడేస్‌ చాణక్య ప్రకటించింది. అయితే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు విజయావకాశాలు ఉన్నట్లు తెలిపింది. 140 సీట్లకు గాను యూడీఎఫ్‌కు దాదాపు 69 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. అస్సాంలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని వెల్లడించింది. 126 సీట్లకు గాను బీజేపీ 50 శాతం ఓట్లతో ఏకంగా 102 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది.  

బెంగాల్‌ ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటించని ‘యాక్సిస్‌ మై ఇండియా’ 
పశ్చిమ బెంగాల్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ను ‘యాక్సిస్‌ మై ఇండియా’ప్రకటించలేదు. బుధవారం ఇతర రాష్ట్రాల ఫలితాలను ప్రకటించినప్పటికీ బెంగాల్‌ విషయం ప్రస్తావించలేదు. గురువారం ప్రకటిస్తారని భావించగా.. అది సాధ్యం కాలేదు. బెంగాల్‌లో భయానక వాతావరణం నెలకొందని, ఇతరులతో మాట్లాడేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని, శాంపిల్‌ సేకరించే పరిస్థితి కూడా లేదని ‘యాక్సిస్‌ మై ఇండియా’అధినేత ప్రదీప్‌ గుప్తా చెప్పారు. అసంపూర్ణమైన సమాచారంతో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ప్రకటించలేమని నిస్సహాయత వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement