బిడ్డల సంరక్షణలో తల్లితోపాటు తండ్రి పాత్ర కూడా కీలకమే
చట్టం తీసుకురావాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: శిశువుల సంరక్షణకు తల్లితోపాటు తండ్రి పాత్ర కూడా కీలకమేనని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. బిడ్డల బాధ్యత అనేది కేవలం ఒక్కరి విధి కాదని పేర్కొంది. బిడ్డ అభివృద్ధిలో తల్లి కీలక పాత్ర పోషించినప్పటికీ, అదే సమయంలో తండ్రి పాత్రను విస్మరించడం అన్యాయం అవుతుందని స్పష్టంచేసింది. పితృత్వ సెలవులను సామాజిక భద్రతా ప్రయోజనంగా గుర్తించాలని, ఈ మేరకు చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఓ కేసు విచారణ సందర్భంగా పితృత్వ సెలవులు ప్రాధాన్యతను నొక్కిచెప్పింది.
తండ్రులకు కూడా సెలవు ఇవ్వడం సమాజంలో లింగపరమైన అంతరాలను తొలగించడానికి దోహదపడుతుందని వెల్లడించింది. అలాగే పిల్లల పెంపకం(పేరెంటింగ్)పై సమతుల్య అవగాహనను పెంపొందిస్తుందని అభిప్రాయపడింది. పిల్లల భావోద్వేగ, శారీరక, మానసిక వికాసంలో తల్లి పాత్ర నిస్సందేహంగా కీలకమైనప్పటికీ, తండ్రికి కూడా అంతే ముఖ్యమైన పాత్ర ఉందని, దాన్ని విస్మరించడం అసంపూర్ణం, అన్యాయమే అవుతుందని ధర్మాసనం పేర్కొంది.


