బెంగళూరు: ఐపీఎల్- 19 విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. విన్నింగ్ సెలబ్రేషన్స్ను పబ్లిక్ రోడ్లపై వేడుకలు జరుపుకోవడాన్ని నిషేధించారు. 2025లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆర్సీబీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీలో అత్యధికంగా ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుగా ఆర్సీబీకీ మంచి రికార్డుంది. ఇక వారి స్వంత రాష్ట్రంలో అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్కు అక్కడి పోలీసులు షాక్ ఇచ్చారు.
భద్రతా కారణాల రీత్యా బెంగళూరు నగర వీధుల్లో బహిరంగ వేడుకలను పోలీసులు నిషేధించారు. గతేడాది జరిగిన ఘోర తొక్కిసలాట సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సిటీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ "బెంగళూరు సిటీ పోలీస్ ప్రేక్షకులు, అభిమానులకు వీధుల్లో బహిరంగంగా వేడుకలు జరుపుకోవద్దని, ముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని అడ్వైజరీ జారీ చేసింది. మేము వాహనాలను తనిఖీ చేస్తున్నాము. బహిరంగ వేడుకలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించము. ఎవరైనా వేడుకలు జరుపుకోవాలనుకుంటే, వారు తమ ఇళ్ల లోపలే జరుపుకోవచ్చు," అని పేర్కొన్నారు.
కాగా గతేడాది ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సమయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంతో వేలాది మంది అభిమానులు ఎం. చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో సంబరాల కోసం గుమిగూడారు. అపరిమితంగా వచ్చిన ఈ జనసందోహం వల్ల ఘోర తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అభిమానులు మృతి చెందారు.


