
రైల్వే శాఖ నిర్ణయం
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు శుభవార్త. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం 4 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ ప్రకటిస్తున్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఇకపై 8 గంటల ముందే చార్ట్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రయాణం విషయంలో గందరగోళానికి తెరపడనుంది.
రిజర్వేషన్ ఖరారు అయ్యిందో లేదో 8 గంటల ముందే తెలిసిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా వెయిటింగ్ లిస్టు ప్రయాణిలకు లబ్ధి చేకూరనుంది. టికెట్ బుకింగ్ వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. టికెటింగ్ వ్యవస్థ పూర్తి పారదర్శ కంగా, ప్రభావవంతంగా, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే రిజర్వేషన్ చార్ట్ను ప్రయాణానికి 8 గంటల ముందు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని దశల వారీగా అమల్లోకి తీసుకొస్తారు.