ఉత్తరాఖండ్ నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామి

Pushkar Singh Dhami Named As Uttarakhand New Chief Minister - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పుష్కర్‌సింగ్‌ ధామి గవర్నర్‌ బేబీరాణి మౌర్యను కలిశారు. శనివారం సాయంత్రం ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్‌ మదన్ కౌశిక్ నేతృత్వంలో సమావేశమైన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ధామిని శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో నూతన సీఎం ఎంపిక అనివార్యమైంది. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది మార్చి 10న తీరత్‌ సింగ్‌ ఉత్తరాఖండ్‌గా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటికీ ఆయన ఎమ్మెల్యే కాదు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం... ఆరు నెలల కాలంలో ఆయన శాసన సభ సభ్యునిగా ఎంపిక కావాల్సి ఉంది. అయితే, సెప్టెంబరు 5తో ఈ గడువు ముగియనుండటం, మరో 6 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉప ఎన్నికలు జరుపలేని పరిస్థితి తలెత్తింది. రాజ్యాంగపరమైన ఇబ్బందుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సూచన మేరకు తీరత్‌సింగ్‌ పదవి నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఇక నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పుష్కర్‌సింగ్‌ ధామి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందారు.

పోటీలో మరో ఇద్దరు.. పుష్కర్‌కే ఓటు
బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ కేంద్ర పరిశీలకుడు నరేంద్ర సింగ్ తోమర్, రాష్ట్ర ఇంఛార్జ్‌ దుష్యంత్ కుమార్ గౌతమ్ పాల్గొన్నారు. సమావేశానికి ముందు తీరత్ సింగ్ రావత్, రాష్ట్ర బిజెపి నాయకులతో కేంద్ర మంత్రి తోమర్ చర్చలు జరిపారు. సత్పాల్ మహారాజ్, ధన్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ పుష్కర్ సింగ్ ధామికే వైపునకే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. 
ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన పుష్కర్‌సింగ్‌ ధామి గవర్నర్‌ బేబీరాణి మౌర్యను కలిసారు.పుష్కర్‌సింగ్‌ ధామి  ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిపొందారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top