అఖిలపక్ష బృందాలకు ప్రధాని మోదీ ప్రశంస | PM Modi meets members of all-party delegations | Sakshi
Sakshi News home page

అఖిలపక్ష బృందాలకు ప్రధాని మోదీ ప్రశంస

Jun 11 2025 4:47 AM | Updated on Jun 11 2025 5:50 AM

PM Modi meets members of all-party delegations

అఖిలపక్ష బృందాల సభ్యులు శశి థరూర్, శ్రీకాంత్‌ షిండే, మనీశ్‌ తివారీ తదితరులతో మోదీ ముచ్చట్లు

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ తదనంతర పరిణామాలు, పాక్‌ ఉగ్రవాద విష సంస్కృతిని ప్రపంచదేశాల ఎదుట ప్రభావవంతంగా ఎండగట్టినందుకు అఖిలపక్ష బృందాలను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. 50 మందికిపైగా సభ్యులతో ఏడు బృందాలుగా బయల్దేరి అత్యంతప్రధానమైన దేశాల్లో పర్యటించి పాక్‌ వైఖరిపై దునుమాడి తిరిగొచ్చిన అఖిలపక్ష సభ్యులను ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో 7, లోక్‌కళ్యాణ్‌మార్గ్‌లోని తన అధికార నివాసంలో కలిశారు. వారి విదేశీ పర్యటన వివరాలను స్వయంగా అడిగి తెల్సుకున్నారు.

అంతర్జాతీయ వేదికపై భారత దృఢవైఖరిని, పాక్‌ దుష్టనీతిని అత్యంత ప్రభావవంతంగా తెలియజెప్పినందుకు వారందరినీ ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా సభ్యులు తమ పర్యటన అనుభవాలు, విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ‘‘ ఉగ్రవాదాన్ని అంతంచేసి శాంతిస్థాపనకు భారత్‌చేస్తున్న కృషిని, భారత్‌పై పాక్‌ చిమ్ముతున్న ఉగ్రవిషాన్ని ప్రపంచదేశాలకు తెలియజేప్పేందుకు పర్యటనకు వెళ్లివచ్చిన అఖిలపక్ష బృందాలతో భేటీ అయ్యా. భారత వాణిని బలంగా వినిపించినందుకు మేమంతా ఎంతగానో గర్వపడుతున్నాం’’ అని తర్వాత మోదీ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌చేశారు.

రవిశంకర్‌ ప్రసాద్, బైజయంత్‌ పాండా(బీజేపీ), శశిథరూర్‌(కాంగ్రెస్‌), కనిమొళి(డీఎంకే), శ్రీకాంత్‌ శిందే(శివసేన), సంజయ్‌ కుమార్‌ ఝా(జేడీయూ), సుప్రియా సూలే (ఎన్సీపీ–ఎస్పీ)ల సారథ్యంలోని ఏడు అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు 33 దేశాల రాజధాని నగరాలు, యురోపియన్‌ యూనియన్‌లో పర్యటించడం తెల్సిందే. 

భేటీలు సత్ఫలితాలనిచ్చాయి: శశిథరూర్‌ 
అమెరికాతోపాటు మరో నాలుగు దేశాల పర్యటనకు సారథ్యంవహించిన కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అంతకుముందు మీడియాతో మాట్లాడారు. ‘‘ భేటీ అద్భుతమైన సత్ఫలితాల నిచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఎంపీలను పంపి భారత ఐక్యతను ప్రభుత్వం చాటింది. అందుకు తగ్గట్లే భేటీలన్నీ ఫలవంతమయ్యాయి. మా లక్ష్యం నెరవేరింది. పహల్గాం దాడి తర్వాత భారత్‌ ఎందుకు ఉగ్ర, పాక్‌ స్థావరాలపై దాడిచేసిందో బలంగా వినిపించాం. ఆయాదేశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఉన్నతాధికారులు, మీడియా సైతం భారత్‌కు మద్దతు పలికారు’’ అని శశిథరూర్‌ అన్నారు.

‘‘ ఉగ్రవాదం విషయంలో భారత దేశ ఐక్యతను చాటడంతోపాటు భారత వాణిని ప్రపంచదేశాలకు బలంగా వినిపించే లక్ష్యంతో ఈ బృందాలు 30కిపైగా దేశాల్లో పర్యటించాయి’’ అని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదలచేసింది. ఇప్పటికే ఈ బృందాల కృషిని భారత విదేశాంగ శాఖ పొగిడింది. ఇప్పటికే ఈ           బృందాలతో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ విడివిడిగా భేటీ అయ్యారు. అమెరికా, యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో ఒక్కో బృందం పర్యటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement