గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు | Pitru Paksha 2024: Bodhgaya, Kurukshetra, Haridwar | Sakshi
Sakshi News home page

గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు

Oct 1 2024 9:28 AM | Updated on Oct 1 2024 9:43 AM

Pitru Paksha 2024: Bodhgaya, Kurukshetra, Haridwar

న్యూఢిల్లీ: పితృ పక్ష అమావాస్యనాడు పెద్దలకు పిండ ప్రదానం చేయడమనేది హిందువుల్లో ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2న పితృపక్ష అమావాస్య. పెద్దలకు పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతుంటారు. అలాగే పిత్ర దోషం కూడా తొలగిపోతుందని అంటారు. పిండ ప్రదానం చేసేందుకు దేశంలోని గయతో పాటు కొన్ని ప్రాంతాలు శ్రేష్టమైనవని చెబుతారు. అవి ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హరిద్వార్
హరిద్వార్‌లోని నారాయణి శిల దగ్గర పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేసేవారిపై పూర్వీకుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని, వారి జీవితంలో శాంతిసౌఖ్యాలు వెల్లివిరుస్తాయని చెబుతుంటారు.

2.బుద్ధగయ
బీహార్‌లోని ఫల్గు నది ఒడ్డున ఉన్న బుద్ధగయ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేసేందుకు విదేశాల నుండి కూడా తరలివస్తారు. విష్ణుపురాణం, వాయుపురాణాలలో దీనిని మోక్షభూమి అని పేర్కొన్నారు. దీనిని విష్ణు నగరి అని కూడా అంటారు. విష్ణువు స్వయంగా పితృదేవత రూపంలో ఇక్కడ ఉన్నాడని, బ్రహ్మ స్వయంగా తమ పూర్వీకులకు ఇక్కడే పిండప్రదానాన్ని చేశారని చెబుతారు.
 

3. కురుక్షేత్ర
హర్యానాలోని కురుక్షేత్రలో పితృపక్ష అమావాస్య రోజున పిండ ప్రదానం చేయడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. మహాభారతంలోని వివరాల ప్రకారం ధర్మరాజు తన కుటుంబ సభ్యులకు  ఇక్కడే పిండప్రదానం చేశాడు.

4. కాశీ
కాశీలో పిండప్రదానం చేయడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతుంటారు. కాశీలోని పిశాచ మోచన్ కుండ్  సమీపంలో మూడు మట్టి పాత్రలను ఉంచి, పిండ ప్రదానం చేస్తారు. ఆరోజున నలుపు, ఎరుపు, తెలుపు జెండాలను ఎగురవేస్తారు. ఇక్కడ  పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షప్రాప్తి కలుగుతుందంటారు. కాశీని మోక్షపురిగా కూడా పిలుస్తారు.

ఇది కూడా చదవండి: 31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement