వల్లూరు : పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరి కొండపైన గల శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ సమీపంలో పవిత్ర పెన్నా నది ఒడ్డున గల రుద్ర పాద ఆలయం వద్ద ఈ నెల 14న పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని పుష్పగిరి శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక పిండ ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం వుంటుందని తెలిపారు. కుల, మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా తమ పితృదేవతలతోపాటు పరమపదించిన వారికి పిండ ప్రదానం చేయవచ్చునని వివరించారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.