Covid-19: ఇలా చేయకండని ఎన్ని సార్లు చెప్పినా.. వీళ్లు మారరా?
కోవిడ్ ఆంక్షలు బేఖాతరు
సంప్రదాయ బలిజాతర నిర్వహించిన గ్రామీణులు
సాక్షి, జయపురం( భువనేశ్వర్): కోవిడ్ మహమ్మారి ప్రజలను కబళిస్తుండగా, దాని కట్టడికి ప్రభుత్వం ఆంక్షలు విధించినా కొన్ని గ్రామాల ప్రజలు వాటిని పట్టించుకోకుండా యథాతథంగా జాతరలు, సంప్రదాయ పండగలు జరుపుకుంటున్నారు. ఆయా పండగల్లో భౌతికదూరం పాటించకుండా వేలాదిమంది మూకుమ్మడిగా పాల్గొంటున్నారు.
ఇటువంటి సంఘటన నవరంగపూర్ జిల్లా కొశాగుమడ సమితి కర్చమాల గ్రామంలో సంభవించింది. ఆదివాసీ ప్రజలు అనాదిగా జరుపుకొనే వ్యవసాయ పండగ బలిజాతర. ఈ నేపథ్యంలో కర్చమాల గ్రామ ప్రజలు శనివారం నిర్వహించిన బలిజాతరలో కోవిడ్ నియమాలు విస్మరించి వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. జాతర సందర్భంగా సంప్రదాయ నృత్య నాట్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు.
భౌతికదూరం పాటించక పోవడమే కాకుండా బలిజాతరలో పాల్గొన్న ఏ ఒక్కరూ మాస్క్ ధరించలేదు. వేలాదిమంది పాల్గొన్న విషయం తెలుసుకున్న కొశాగుమడ పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ సందర్భంగా కరోనా నియమాలు ఉల్లంఘించి బలిజాతర నిర్వహించిన కమిటీ సభ్యుల నుంచి పోలీసులు రూ.10 వేల జరిమానా వసూలు చేశారు. అలగే నియమాలు ఉల్లంఘించిన కమిటీపై కేసు నమోదు చేశారు.
చదవండి: అత్యంత చవకగా కార్బేవ్యాక్స్