ఆపరేషన్‌ సిందూర్‌ ఆగదు: ప్రధాని మోదీ | PM Narendra Modi Says Operation Sindoor Not Over In West Bengal, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ సిందూర్‌ ఆగదు: ప్రధాని మోదీ

May 30 2025 4:48 AM | Updated on May 30 2025 11:43 AM

Operation Sindoor not over says PM Narendra Modi

ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ   

ఉగ్రవాదులకు, కుట్రదారులకు గుణపాఠం నేర్పడం ఖాయం  

ముష్కర మూకలను కోలుకోలేని రీతిలో దెబ్బకొడతామని హెచ్చరిక

గాంగ్‌టక్‌/అలీపూర్‌ద్వార్‌: ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులకు తగిన గుణపాఠం నేర్పడానికి ప్రారంభించిన ఆపరేషన్‌ సిందూర్‌ ఆగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తేల్చిచెప్పారు. ముష్కర మూకలను కోలుకోలేని రీతిలో దెబ్బకొట్టడం ఖాయమని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.

 ప్రధాని మోదీ గురువారం సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. అనంతరం పశ్చిమ బెంగాల్, బిహార్‌లో పర్యటించారు. పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గత నెలలో జరిగిన ఉగ్రదాడి భారతీయ ఆత్మ, ఐక్యత, మానవత్వంపై జరిగిన దాడిగా ప్రధాని అభివర్ణించారు. 

ఈ దాడి పట్ల నిర్ణయాత్మకంగా స్పందించామని, ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదులకు తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్పామని అన్నారు. పాకిస్తాన్‌ భూభాగంలో ముష్కరుల స్థావరాలు, మౌలిక సదుపాయాలు, వైమానిక కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో మనదేశం మొత్తం ఐక్యంగా ఉందని పునరుద్ఘాటించారు. 

దేశంలో మతపరంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలన్న లక్ష్యంతోనే పహల్గాంలో కుట్రపూరితంగా పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారని ప్రధాని ఆరోపించారు. మన ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచేస్తే చివరకు ఏం జరుగుతుందో చేసి చూపించామని స్పష్టంచేశారు. సిక్కిం రాష్ట్రం భారత్‌కు గర్వకారణమని అన్నారు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల సంపూర్ణ విశ్వాసం చూపుతున్నారని ప్రశంసించారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ వేడుకలకు తాను స్వయంగా హాజరు కాలేకపోవడం బాధగా ఉందన్నారు. సిక్కిం రాష్ట్రం ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు  తెలియజేశారు. 

ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు  
ఉగ్రవాద ఉత్పత్తి కర్మాగారంగా మారిన పాకిస్తాన్‌ భూభాగంలోకి మూడుసార్లు ప్రవేశించి దాడులు చేశామని ప్రధాని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌ద్వార్‌ జిల్లాలో రూ.1,010 కోట్ల విలువైన సిటీ గ్యాస్‌ పంపిణీ ప్రాజెక్టుకు ఆయన పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రస్తావించారు. బెంగాలీ సంస్కృతికి సిందూర్‌తో భావోద్వేగ అనుబంధం ఉందన్నారు. దుర్గా పూజ సమయంలో ఇక్కడి మహిళలు ‘సిందూర్‌ ఖేలా’ వేడుక నిర్వహించుకుంటారని తెలిపారు.

బెంగాల్‌లో రాక్షస పాలన  
పశ్చిమ బెంగాల్‌లో అరాచక పాలన సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో హింస, అవినీతి పెచ్చుమీరిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఇక్కడ చట్టబద్ధమైన పాలన ఉందా? అని ప్రశ్నించారు. బెంగాల్‌ ప్రజలు సంక్షోభాల్లో చిక్కుకున్నారని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.  తృణమూల్‌ కాంగ్రెస్‌కు బెంగాల్‌ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బెంగాల్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా మమతా బెనర్జీ సర్కారు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.

పాట్నాలో మోదీ భారీ రోడ్‌ షో  
బెంగాల్‌ పర్యటన అనంతరం ప్రధాని మోదీ బిహార్‌ రాజధాని పాట్నాకు చేరుకున్నారు. పాట్నా ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్‌ భవనాన్ని ప్రారంభించారు. అలాగే కొత్త సివిల్‌ ఎన్‌క్లేవ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గురువారం సాయంత్రం పాట్నాలో భారీ రోడ్‌షోలో మోదీ పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలోని అరణ్య భవన్‌ నుంచి బీర్‌చంద్‌ పటేల్‌ మార్గ్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం దాకా ఈ రోడ్‌షో జరిగింది. శుక్రవారం బిహార్, ఉత్తరప్రదేశ్‌లో పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు.       
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement