
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే చంపిన వారందరిని కాస్గంజ్లోని హజ్ చెరువులో పడేసేవాడు.
సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్ వృత్తికే మచ్చ తెచ్చి 50పైగా హత్యలు చేసిన ఆయుర్వేద డాక్టర్ దేవేంద్ర శర్మ నేర చరిత్ర విస్మయాన్ని కలిగిస్తోంది. దేవేంద్ర కేవలం కిడ్నీ రాకెట్ మాత్రమే కాకుండా ఫేక్ గ్యాస్ ఏజెన్సీ, వాహనాలను దొంగిలించి అమ్మడం లాంటి పనులను కూడా చేసినట్లు తెలుస్తోంది. గ్యాస్ ఏజెన్సీ కోసం సిలిండర్లను తీసుకువెళ్లే వాహనాలను ఆపి, డ్రైవర్లను హత్య చేసేవాడు. మొత్తంగా 100 మంది వరకు దేవేందర్ శర్మ హత్య చేశాడు.
దేవేంద్ర శర్మ నేర చరిత్ర గురించి పరిశీలిస్తే:
1984లో బ్యాచ్లర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసన్లో డిగ్రీ పూర్తి చేసి రాజస్తాన్లో ఒక క్లినిక్ తెరిచాడు. జనవరి, 1994లో గ్యాస్ ఏజెన్సీ డీలర్షిప్ కోసం రూ. 11 లక్షలు పెట్టుబడి పెట్టాడు. 1994 ఆగస్టులో కంపెనీ నష్టాలతో మూతబడింది. 1995లో శర్మ ఫేస్ గ్యాస్ ఏజెన్సీని మొదలు పెట్టాడు.
1995 నుంచి 2004 వరకు
ఈ సమయంలో శర్మ గ్యాస్ సిలిండర్లను తీసుకువెళ్లే వాహనాలను ఆపి డ్రైవర్లను హత్య చేసేవాడు. అలా 24 మంది వరకు హత్య చేశాడు. తరవాత డాక్టర్ అమిత్తో కలిసి కిడ్ని రాకెట్లో పాల్గొన్నాడు. ఒక్కో కిడ్నీకి రూ. 7 లక్షల వరకు తీసుకునేవాడు. అలా 125 కిడ్నీ ట్రాన్స్ప్లాన్టేషన్స్ వరకు చేశారు. తరువాత ట్యాక్సీని అద్దెకు తీసుకొని ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ రోడ్డుకు తీసుకువెళ్లి డ్రైవర్ను చంపేసి ట్యాక్సీని సెకెండ్ హ్యాండ్ దుకాణంలో అమ్మేసేవాడు. ఇవి చేస్తూ కూడా శర్మ రాజస్తాన్లో తన క్లినిక్ను నడిపేవాడు.
2004 నుంచి 2020 వరకు
శర్మ 16 ఏళ్లు జైల్లో గడిపాడు. జనవరి 28, 2020లో సత్ప్రవర్తన కారణంగా 20 రోజుల పాటు పెరోల్పై విడుదలయ్యడు. ఫిబ్రవరి 16న తప్పించుకొని అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయాడు. అలీఘఢ్లో నెల రోజుల పాటు దాక్కున్నాడు. మార్చి 2020లో ఢిల్లీలోని మోహన్ గార్డెన్లో ఉన్న బంధువుల ఇంట్లో ఉన్నాడు. ఏప్రిల్లో బిజినెస్మ్యాన్గా వేషం మార్చి ఆస్తులను అమ్మే పని మొదలు పెట్టాడు. మే 2020లో గీత అనే ఎన్జీఓ వర్కర్ను పెళ్లి చేసుకున్నాడు. జూలై 28న దేవేంద్ర శర్మను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది.
ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏంటంటే దేవేంద్ర శర్మ, చంపిన వారందరిని అనుమానం రాకుండా ఉత్తరప్రదేశ్ కాస్గంజ్లోని హజ్ చెరువులో పడేసేవాడు. ఎందుకంటే అక్కడ ముసళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆనవాళ్లు ఏం దొరకకుండా చేయడానికి దేవేంద్ర శర్మ ఈ విధంగా చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది.