బెంగాల్‌ అసెంబ్లీలో రగడ  | Mamata Banerjee Vote Chore Speech WB Assembly Rucks Updates | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ అసెంబ్లీలో రగడ 

Sep 4 2025 4:37 PM | Updated on Sep 5 2025 6:39 AM

Mamata Banerjee Vote Chore Speech WB Assembly Rucks Updates

అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర ఘర్షణ   

మార్షల్స్‌ బలవంతంగా లాక్కెళ్లడంతో బీజేపీ చీఫ్‌ విప్‌కు గాయాలు  

బీజేపీ అవినీతి పార్టీ, దొంగల పార్టీ అంటూ సీఎం మమతా బెనర్జీ మండిపాటు  

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం  

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ శాసనసభ రణరంగాన్ని తలపించింది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్, విపక్ష బీజేపీ సభ్యుల మధ్య గురువారం తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాల్‌ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ దాడులను ఖండిస్తూ తీర్మానం ఆమోదించాలని పట్టుబట్టారు. తీర్మానంపై తొలుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడారు. 

బీజేపీ తీరుపై విరచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా బెంగాల్‌ ప్రజలపై కక్షగట్టారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు జరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బెంగాలీతోపాటు ఇతర భాషలను వారు వ్యతిరేకిస్తున్నారని ఆక్షేపించారు. బీజేపీ అవినీతి పార్టీ, దొంగల పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. ఓట్ల దొంగతనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్‌లో తమ పార్టీ ఎంపీలపై సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లను ఉసిగొల్పిందని అన్నారు. దేశాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని నామరూపాల్లేకుండా చేయాలని వ్యాఖ్యానించారు.

 మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వారిని హెచ్చరిస్తూ మమతా బెనర్జీ మాట్లాడారు. ఈ సభలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉండని రోజు వస్తుందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని తేల్చిచెప్పారు. ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి కూలదోస్తారని అన్నారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై జరుగుతున్న అరాచకాలపై అసెంబ్లీలో చర్చించడానికి బీజేపీ సభ్యులకు భయమెందుకని ప్రశ్నించారు. దాంతో సభలో అలజడి మొదలైంది. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం దూషించుకున్నారు. ఓట్ల దొంగ బీజేపీ అంటూ తృణమూల్‌ కాంగ్రెస్, ఉద్యోగాల దొంగ తృణమూల్‌ కాంగ్రెస్‌ అంటూ బీజేపీ సభ్యులు నినదించారు. నీళ్ల సీసాలు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సభలో సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి.  

బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌  
సభలో పరిస్థితి అదుపు తప్పడంతో బీజేపీ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ శంకర్‌ ఘోష్‌ను సభ నుంచి రోజంతా సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ బీమన్‌ బెనర్జీ ప్రకటించారు. మార్షల్స్‌ను సభలోకి పిలిపించారు. తమ పార్టీ చీఫ్‌ విప్‌ సస్పెన్షన్‌ పట్ల బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జైశ్రీరామ్‌ అని నినదిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. 

బయటకు వెళ్లేందుకు నిరాకరించిన శంకర్‌ ఘోష్‌ను మార్షల్స్‌ బలవంతంగా లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి. బీజేపీ సభ్యులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, రాక్షసుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, బెంగాలీ వలస కార్మికుల హక్కులు, భద్రతపై జరుగుతున్న కీలకమైన చర్చను అడ్డుకొనేందుకు ప్రయతి్నస్తున్నారని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. 

సభలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ ఎమ్మెల్యేలు అగ్నిమిత్ర పాల్, మిహీర్‌ గోస్వామి, బంకీం ఘోష్, అశోక్‌ దిండాను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. ఇదిలా ఉండగా, విపక్ష సభ్యుల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన తమ పార్టీ ఎమ్మెల్యేలను మమతా బెనర్జీ మందలించారు. పద్ధతి మార్చుకోకపోతే మమ్మిల్ని కూడా సస్పెండ్‌ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు అసెంబ్లీ చరిత్రలో నేడు చీకటి రోజు అని బీజేపీ నేతలు పేర్కొన్నారు. సభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు గూండాల మాదిరిగా వ్యవహరించారని తప్పుపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement