Major Tragedy Averted Police Arrests Terrorist Aide 5 KG IED Pulwama - Sakshi
Sakshi News home page

భద్రతా బలగాలకు తప్పిన పెను ముప్పు.. భారీస్థాయిలో పేలుడు పదార్థాలు స్వాధీనం

May 7 2023 6:01 PM | Updated on May 7 2023 7:06 PM

Major Tragedy Averted Police Arrests Terrorist Aide 5 kg IED Pulwama - Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలకు పెనుముప్పు తప్పింది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఓ వ్యక్తిని జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద అయిదు కేజీల పేలుడు పదార్థం(ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని బుద్గామ్‌లోని అరిగాం నివాసి అయిన ఇష్ఫాక్ అహ్మద్ వానీగా పోలీసులు గుర్తించారు. వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు.

భారీస్థాయిలో పేలుడు పదార్థాలు లభించడంతో ఉగ్రవాదుల భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తర కశ్మీర్‌లో భద్రతా బలగాలు భద్రతను కట్టిదిట్టం చేశాయి. అదనపు భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు నిఘా కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా గత వారం జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులు అరాచానికి పాల్పడిన విషయం తెలిసిందే. కంది అటవీ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా టెర్రరిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు జవాన్లు అమరులయ్యారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత భారీస్థాయిలో పేలుడు పదార్థాలు లభించడం గమనార్హం. 
చదవండి: స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు.. ఆరుగురు అమ్మాయిలకు గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement