ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, మహరాష్ట్ర ఆహార,ఔషధాల నియంత్రణ శాఖ మంత్రి నరహరి జిర్వాల్ తన అధికారిక నివాసంలో ఓ ట్రాన్స్జెండర్తో రాస లీలలు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ వీడియోలపై నరహరి సోదరుడు ఎన్సీపీ నేత రవి యాదవ్ మీడియాతో మాట్లాడారు. ట్రాన్స్జెండర్ వెనుక కీలక నేతలు ఉన్నారు. ఆ నేతలే సదరు ట్రాన్సెజెండర్తో వీడియోలు తీయించారు. ట్రాన్స్జెండర్ కోటాలో ఎమ్మెల్సీతో పాటు ఇతర కీలక పదవులు పొందేందుకు మా సోదరుడి వీడియోలు తీశారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నరహరినే కాదు గతంలో తనని కూడా ట్రాన్స్ జెండర్ బెదిరించారాని గుర్తు చేశారు.
ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నేత, సామాజిక కార్యకర్త అంజలి దమనియా తీవ్రంగా స్పందించారు. ‘ఇది సిగ్గుచేటు. ఇదే మంత్రి గతంలో లంచం కేసులో కూడా ఇరుక్కున్నాడు. ఇలాంటి వ్యక్తిని పదవిలో ఉంచడం పార్టీకి అవమానం’ అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సక్పాల్ కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. ప్రపంచంలో ‘ఎప్స్టిన్ ఫైల్స్’ ఎలా చెడ్డపేరు తెచ్చుకున్నాయో, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది,” అని ఎద్దేవా చేశారు.
ఇక ఎన్సీపీ నేత అమోల్ మిత్కరి మాత్రం ఈ వీడియోను పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ‘ఈ వీడియో ఎనిమిది నెలల పాతది. అసెంబ్లీ సెషన్ ముగిసిన వెంటనే ఎందుకు బయటకు వచ్చింది?. జ్యోతిష్కుడు అశోక్ ఖరాట్ కేసులో దృష్టి మళ్లించడానికి ఈ వీడియోను ఉపయోగిస్తున్నారు. అలాగే, అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన భార్య సునేత్రా పవార్ ఎన్సీపీ అధ్యక్షురాలిగా రావాలని మొదటగా డిమాండ్ చేసింది జిర్వాల్. అప్పటి నుంచి ఆయనపై వరుసగా వివాదాలు ముసురుకుంటున్నాయని పేర్కొన్నారు.
జిర్వాల్పై ఇదే మొదటి వివాదం కాదు. మహారాష్ట్రలోని దిండోరి గిరిజన ప్రాంతానికి చెందిన ఈ నాయకుడి కార్యాలయంలోని ఒక క్లర్క్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. లంచంలో మంత్రి ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో చర్చకు దారితీసింది. అప్పుడూ ప్రతిపక్షం ఆయన రాజీనామా కోరింది. ఈ రెండు వివాదాలు కూడా అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత వెలుగులోకి రావడం గమనార్హం.
ఎన్సీపీ కొత్త అధ్యక్షురాలు సునేత్రా పవార్ పదవిలోకి వచ్చి ఒక నెల పూర్తయిన రోజే ఈ వీడియో బయటకు రావడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నాసిక్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి కొంతమంది పార్టీ నేతలు మహిళా విభాగం అధ్యక్షురాలు రూపాలి చకంకర్ను తొలగించాలని, జిర్వాల్పై చర్యలు తీసుకోవాలని లేఖలు రాశారు. చకంకర్ పేరు కూడా జ్యోతిష్కుడు అశోక్ ఖరాట్ కేసులో వినిపించడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని వారు పేర్కొన్నారు.
మొత్తం మీద, ఈ వీడియో వివాదం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతను తెచ్చింది. ఒకవైపు బ్లాక్మెయిల్ ఆరోపణలు, మరోవైపు రాజకీయ కుట్ర ఆరోపణలు, ఎన్సీపీ అంతర్గత విభేదాలు, ప్రతిపక్ష ఒత్తిడి ఇవన్నీ కలిపి జిర్వాల్ భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చాయి.


