‘అత్యాచారం కేసును రాజకీయం చేస్తున్నారు’ | Madras HC Comments On Anna University Assault Case | Sakshi
Sakshi News home page

‘అత్యాచారం కేసును రాజకీయం చేస్తున్నారు’

Jan 2 2025 2:27 PM | Updated on Jan 2 2025 4:32 PM

Madras HC Comments On Anna University Assault Case

ఈ కేసులో మహిళల భద్రతపై అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు’’

చెన్నై: తమిళనాడును కుదిపేసిన అన్నా యూనివర్సిటీ(Anna University) ఘటనపై ఆ రాష్ట్ర  ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌ను తాజాగా మద్రాస్‌ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.

ఘటనను నిరసిస్తూ చెన్నై వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పట్టాలి మక్కల్‌ కట్చి(పీఎంకే) భావించింది. అయితే.. పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారు. దీంతో పీఎంకే హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం.. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు.  అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది.

మరోవైపు..ఈ కేసులో ప్రజాగ్రహం పెల్లుబిక్కడంతో సిట్‌తో దర్యాప్తు చేయించాలని మద్రాస్‌ హైకోర్టు ఇదివరకే ఆదేశించింది కూడా.

డిసెంబర్‌ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో..

ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానికంగా బిర్యానీ వ్యాపారి అయిన జ్ఞానేశ్వర్‌.. అధికార డీఎంకే యువ విభాగానికి గతంలో పని చేశాడు. దీంతో రాజకీయంగానూ దుమారం రేగింది. విద్యా సంస్థలలోనూ విద్యార్దినులకు భద్రత కరువైందన్న ఆందోళనను ప్రతిపక్షాలు వ్యక్తంచేశాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai), డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్‌, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు వేర్వేరు ప్రకటనలో ఈ ఘటనను ఖండించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు డీఎంకే నేతలతో జ్ఞానేశ్వర్‌ దిగిన ఫొటోలను వైరల్‌ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ అడుగు ముందుకు వేసి ఘటనకు నిరసనగా కొరడాతో బాదుకున్నారు. ప్రభుత్వం కదిలేవరకు చెప్పులు వేసుకోనంటూ ప్రతిన బూనారు. మరోవైపు టీవీకే అధ్యక్షుడు, నటుడు  విజయ్‌ కూడా కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరగాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా మద్రాస్‌ హైకోర్టు రాజకీీయం చేస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement