‘వీళ్లసలు మనుషులేనా?’.. పోలీసుల ముందే చితకబాదారు | Kerala Nedumangad Arshid Case Shocking Details | Sakshi
Sakshi News home page

Justice For Arshid: ‘వీళ్లసలు మనుషులేనా?’.. పోలీసుల ముందే చితకబాదారు

Jun 1 2026 10:46 AM | Updated on Jun 1 2026 7:43 PM

Kerala Nedumangad Arshid Case Shocking Details

మొదట అది సాధారణ మరణం అనుకున్నారు. తినేటప్పుడు ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని స్వయంగా తల్లే చెప్పడంతో అంతా అదే నిజమనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదిక వెన్నులో వణుకు పుట్టించే విషయాల్ని బయటపెట్టింది. పోలీసులు సైతం ఆ నివేదిక చూసి షాక్‌కు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అలా ఆ చిన్నారి కేసు యావత్‌ సమాజాన్ని కుదిపేసిన ఘటనగా మారింది. పట్టరాని కోపంతో.. అదీ పోలీసుల సమక్షంలోనే జనాలు నిందితుల మీద దాడి చేసే దాకా తీసుకెళ్లింది.. 

కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగాడ్‌లో.. ఏడాదిన్నర వయసున్న అర్షిద్‌ మరణం అందరితో ‘అయ్యో పాపం’ అనిపిస్తోంది. భోజనం చేస్తుండగా.. దగ్గు, వాంతులు చేసుకుంటూ ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడని..  ఆస్పత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ కన్నుమూశాడని తల్లి అఖిల(24) మీడియా ముందు వాపోయింది. అయితే ఆమె కన్నీళ్లంతా కట్టుకథ అని తేలడానికి 24 గంటలు కూడా పట్టలేదు. 

అర్షిద్‌ మాములు చిన్నారేం కాదు. కొన్ని నెలల కిందట.. రెండు చేతులకు ‍బ్యాండ్‌లతో తల్లి చంకలో సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ అయ్యాడు. ఆడుకుంటుండగా సైకిల్‌ మీద నుంచి పడిపోయాడని చెబుతూ.. ఆమె పలువురి సాయం కోరడం నెట్టింట వైరల్‌ అయ్యింది. అలా ఆ తల్లికి చాలామంది డబ్బు కూడా పంపించారు. కట్‌ చేస్తే..   మే 29వ తేదీన ఆ చిన్నారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. 

అన్నం తింటుండగా ఆ చిన్నారి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అఖిల, ఆమె స్నేహితుడు అష్కర్‌ అర్షిద్‌ను హుటాహుటిన పనవూర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. ఈలోపు ఒంటిపై గాయాలు కనిపించడంతో పోలీసులు అనుమానంతో పోస్టుమార్టం నిర్వహించారు. అందులో షాకింగ్‌ విషయాలు బయటపెట్టాయి. 

అర్షిద్‌ ఒంటిపై సుమారు 50కి పైగా గాయాల గుర్తులు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. అంతేకాదు.. సిగరెట్లతో ఒంటి నిండా కాల్చిన గాయాలు ఉండడం వైద్యుల్ని విస్మయానికి గురిచేసింది. పైగా ఈ గాయాలు ఒక్కరోజులో జరిగినవి కావని.. చాలా కాలంగా కొనసాగుతున్న హింసకు సంబంధించినవని తేల్చారు.

నెలల వయసు నుంచే..
అఖిల కడుపుతో ఉన్నప్పుడు ఆమె భర్త అఖిల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె అష్కర్‌(31) అనే వ్యక్తితో సహజీవనం మొదలుపెట్టింది. ఈ సంబంధం కారణంగానే ఆమె పుట్టిన బిడ్డను తల్లికి అప్పగించింది. అయితే అఖిల భర్త తరఫున బంధువుల అభ్యంతరాలతో తిరిగి చిన్నారిని తన దగ్గరకు తెచ్చుకుంది. అప్పటి నుంచే చిన్నారి అర్షిద్‌కు వేధింపులు మొదలయ్యాయి. ఆ సమయంలోనూ శరీరంపై తరచూ గాయాలు కనిపించేవని.. అడిగితే గాయాలపాలవుతున్నాడని చెప్పేదని అఖిల తల్లి పోలీసులకు చెబుతోంది. 

అంతేకాదు.. మే నెలలో వైరల్‌ అయిన వీడియోను కూడా అర్షిద్‌ అమ్మమ్మ గుర్తు చేసింది. మనవడి చేతులు విరిగిన సందర్భంలోనూ కూతురు, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఇక.. చుట్టుపక్కల వాళ్లు చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంపై చాలాసార్లు అఖిలను నిలదీసినట్లు చెబుతున్నారు. 

ఆగ్రహంతో దంచి కొట్టారు!
పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు కేసును అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా మార్చారు. కేసు తీవ్రత దృష్ట్యా మే 30న అఖిల, అష్కర్‌లను అరెస్ట్‌ చేశారు. చిన్నారిపై నిరంతరం హింస కొనసాగుతున్న విషయం తెలిసినా తల్లి అడ్డుకోలేదని, అధికారులకు సమాచారం ఇవ్వలేదని స్పష్టమైంది. అందుకే ఆమెపైనా హత్య కేసు నమోదు చేశారు. అంతేకాదు.. గతంలో చేతులు విరిగిన ఘటనలోనూ ఆమె ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. 

ఇక ఆదివారం అష్కర్‌ను ఘటనాస్థలికి తీసుకెళ్లి సాక్ష్యాలు సేకరిస్తుండగా.. స్థానికులు ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు కూడా వాళ్లను నిలువరించలేపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులిద్దరినీ కఠినంగా శిక్షించాలని అర్షిద్‌ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు.. స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జస్టిస్‌ ఫర్‌ అర్షిద్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement