ఐటీ నోటీసులు.. కాంగ్రెస్‌కు భారీ ఊరట | No Coercive Steps Over Rs 3500 Crore Demand: Tax Relief For Congress - Sakshi
Sakshi News home page

ఐటీ నోటీసులు.. కాంగ్రెస్‌కు భారీ ఊరట

Published Mon, Apr 1 2024 12:21 PM

IT Department says No Coercive Steps 3500 Crore Demand Tax Relief For Congress - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఊరట లభించింది. రూ.3500 కోట్ల పన్ను బకాయిల విషయంలో జూలై 24 వరకు ఎటువంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికే పన్ను బకాయిలు చూపించి కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాల నుంచి ఆదాయ పన్ను శాఖ రూ.135 కోట్లను రికవరీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ముందుగా హైకోర్టు ఆశ్రయించగా అక్కడ ఊరట లభించకపోవటంతో అనంతరం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కాంగ్రెస్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీకోర్టు విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు ఏ పార్టీకి ఆదాయపన్ను శాఖ నుంచి బకాయిల విషయంలో ఎటువంటి  ఇబ్బంది కలగదని సుప్రీంకోర్టు తెలియజేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 24కి వాయిదా వేసింది.

ఇక.. 2017-2018 నుంచి 2020-2021 అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీలతో కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలని శుక్రవారం నోటీసు పంపిన ఆదాయపన్న శాఖ...నిన్న(ఆదివారం) రూ. 1744 కోట్లు  కట్టాలని మరో నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. 2014-15 నుంచి 2016-17 అసెస్‌మెంట్‌ సంవత్సారాలకు సంబంధించిన పూర్తి మొత్తాన్ని ఆ నోటీసులో పేర్కొంది. మరోవైపు.. కేంద్ర  ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల వేళ.. పన్ను ఉగ్రవాదంతో ప్రధాన ప్రతిక్షాలను ఆర్థికంగా తీవ్రం ఇబ్బందికి గురిచేస్తోందని ఆరోపణల చేసింది. ఇక.. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి కూడా ఫిర్యాదు చేయటం గమనార్హం.

Advertisement
Advertisement