House of man who paraded Manipur women set on fire - Sakshi
Sakshi News home page

మణిపూర్‌ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటిని తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు

Published Fri, Jul 21 2023 9:14 AM

House of man who paraded Manipur women set on fire - Sakshi

ఢిల్లీ/ఇంఫాల్‌: కేవలం 26  సెకండ్ల నిడివి ఉన్న వీడియో.. యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా మార్చేసి.. ఆపై జరిగిన రాక్షాస క్రీడపై సభ్యసమాజం రగిలిపోతోంది. కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే.. ఈ ఘటనపై ప్రజాగ్రహం మాత్రం చల్లారడం లేదు. 

ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రకటించిన హుయిరేమ్ హెరోదాస్ సింగ్‌ ఇంటిని ఓ మూక తగలబెట్టేసింది.  పేచీ అవాంగ్ లైకైలో ఉన్న హోరోదాస్‌ ఇంటిని చుట్టుముట్టిన కొందరు గ్రామస్తులు.. తాళం వేసిన ఆ ఇంటిని టైర్లతో కాల్చేశారు. ఆపై ఆ కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు నినాదాలు చేశారు.  ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా..  భద్రతా బలగాలు ఆ ఊరిలో మోహరించాయి. 

మణిపూర్‌లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడ్ని వీడియో ఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. నగ్నంగా ఉన్న ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించాడు హుయిరేమ్‌. అయితే అప్పటికే వీడియో వైరల్‌ కావడంతో భయంతో కుటుంబాన్ని వేరే చోటకి తరలించి.. తాను మాత్రం మరో చోట తలచాచుకున్నాడు. 

ఇదీ చదవండి: ఎవరీ మెయితీలు.. కుకీలతో ఉన్న గొడవలేంటంటే..

బుధవారం రాత్రి థౌబల్‌ జిల్లాను జల్లెడ పట్టిన పోలీసులు.. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ అకృత్యానికి సంబంధించి మరో ముగ్గురినీ సైతం అరెస్ట్‌ చేసినట్లు గురువారం సాయంత్రం ప్రకటించారు. వీళ్ల ద్వారా మిగతా నిందితులను పట్టకునే పనిలో ఉన్నారు మణిపూర్‌ పోలీసులు. 

మెయితీల గిరిజన హోదా డిమాండ్‌తో మొదలైన వ్యవహారం.. మే 3వ తేదీన కుకీ-మెయితీల మధ్య ఘర్షణలు మొదలై మణిపూర్‌ హింసకు ఆజ్యం పోసింది. ఆ సమయంలో ఓ ఫేక్‌ వీడియో వైరల్‌ కావడంతో రగిలిపోయిన మెయితీ వర్గం.. కుకీ ప్రజలపై దాడులకు సిద్ధపడింది. ఈ క్రమంలో మే 4వ తేదీన..  బి ఫైనోమ్ గ్రామంలో కర్రలు వంటి ఆయుధాలు చేతపట్టిన సుమారు 800 మంది మెయితీ వర్గానికి చెందిన వారు, కుకీ గిరిజన వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను పోలీసుల నుంచి బలవంతంగా లాక్కెళ్లి..  నగ్నంగా ఊరేగించారు. అడ్డొచ్చిన ఇద్దరిపైనా దాడి చేసి చంపినట్లు(వాళ్లలో 21 ఏళ్ల యువతికి చెందిన తండ్రి, సోదరుడు ఉన్నారు) తెలుస్తోంది. ఆపై ఆ మహిళలిద్దరినీ ఊరేగించి.. సామూహిక లైంగిక దాడికి కూడా పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
ఇదీ చదవండి: మే 4న జరిగింది ఇదే..

మణిపూర్‌ హైకోర్టు ఆదేశాలనుసారం.. ఇటీవల కొన్నిచోట్ల ఇంటర్నెట్‌ బ్యాన్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో ఈ ఈ హేయమైన సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ నెట్టింట హఠాత్తుగా ప్రత్యక్షమైంది.  బుధవారం సోషల్‌మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్‌ కావడంతో.. దేశం ఉలిక్కిపడింది.

దీంతో వైపు రాజకీయ దుమారం చెలరేగగా.. ప్రధాని మోదీ సైతం నిందితులను వదిలిపెట్టమని ప్రకటించారు. మరోవైపు కేంద్రంతో మాట్లాడిన మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌.. నిందితులకు మరణ శిక్ష పడేలా చూస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. 

మరోవైపు సోషల్‌ మీడియా నుంచి వీడియోలను తొలగించాలని కేంద్రం అన్ని ఫ్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మహిళా కమిషన్‌ సైతం స్పందించి ఆ వీడియోలను తొలగించాలని ఆదేశించింది. ఇక.. ఘటనను హేయనీయమైన చర్యగా అభివర్ణించిన సుప్రీం కోర్టు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గనుక చర్యలు తీసుకోకుంటే తామే రంగంలోకి దిగుతామని స్పష్టం చేస్తూ.. వచ్చే శుక్రవారానికి(జులై 28కి) విచారణ వాయిదా వేసింది. 

ఇదీ చదవండి: మణిపూర్‌ వీడియో పాతది.. అందుకే.. 

Advertisement
Advertisement