డెహ్రాడూన్: ఉత్తరఖండ్లో ఒక మహిళ టెకీ అనుమానాస్పాద రీతిలో మృతిచెందింది. గురుగ్రామ్కు చెందిన గాయత్రి అనే మహిళ ముస్సోరి హోమ్ స్టేలో రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకొని ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు.
పోలీసులు వివరాల ప్రకారం
గురుగ్రామ్లో నివాసముంటున్న శ్రీచరణ్, గాయత్రి దంపతులిద్దరూ టెకీ ఉద్యోగులు. వారి విహారయాత్రలో భాగంగా ఈ నెల జూన్ 13 న ముస్సోరీ-ధనౌల్తీ రోడ్డులోని 'కియానా హోమ్స్టే టిప్రిధర్'కు చేరుకున్నారు. ఆదివారం రాత్రి దాదాపు 11:30 గంటల సమయంలో హోమ్స్టేలోని చెక్-ఇన్ అయ్యారు. అయితే ఆ మరుసటి రోజు జూన్ 15 హోమ్స్టేలో ఒక మహిళ స్పృహ లేకుండా పడి ఉందనే సమాచారం ముస్సోరీ పోలీసులకు అందింది. వెంటనే అక్కడికి అంబులెన్స్ను పంపించగా, అందులోని ఫార్మాసిస్ట్ ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.
మృతురాలి భర్త శ్రీచరణ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో.. తామిద్దరం ఆదివారం రాత్రి మద్యం సేవించి, తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయామని తెలిపాడు. ఉదయం లేచి చూసేసరికి తన భార్య ముక్కు నుంచి రక్తం కారుతూ నేలపై స్పృహ లేకుండా పడి ఉందని పేర్కొన్నాడని తెలిపారు.
అయితే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు "మృతురాలి మృతదేహం గదిలోని నేలపై దుస్తులు లేకుండా పడి ఉంది. బెడ్షీట్పై రక్తపు మరకలు ఉన్నాయి. గదిలో రెండు ఖాళీ మద్యం సీసాలు, తినుబండారాలను స్వాధీనం చేసుకున్నాం" అని తెలిపారు.ఈ దంపతులకు 2025 నవంబర్ 8న వివాహం జరిగిందని, వీరిద్దరూ అసలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు చెందిన వారని పోలీసులు తెలిపారు.


