ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక గైనకాలజిస్ట్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళనను చర్చను రేకెత్తిస్తోంది. 22 ఏళ్ల ఒక యువతి ప్రస్తుతం తన 6వ బిడ్డకు జన్మనివ్వబోతుండటమే ఇందుకు కారణం. ఆ డాక్టర్ తెలిపిన వివరాలు తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.
రాజస్థాన్కు చెందిన ఈ దంపతులకు 15 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. వీరికి అప్పటికే ఐదుగురు పిల్లలు (నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు) ఉన్నారు. అయినప్పటికీ, మరొక మగపిల్లాడు కావాలనే ఆశతో వారు మళ్లీ గర్భం దాల్చారు. స్పందన్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ ప్రగ్యా తోమర్ పేషెంట్ , ఆమె భర్త అనుమతితోనే ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీని ప్రకారం ఆ మహిళ డాక్టర్తో ఇలా అంది. "నాకు వరుసగా ఆడపిల్లలే పుడుతున్నారు.. మాకు ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు, మాకు ఇంకొక అబ్బాయి కావాలి" అని చెప్పింది. ఆమె భర్త స్పందిస్తూ.. కుటుంబాన్ని పోషించడానికి, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒకే ఒక కొడుకు సరిపోడంటూ వ్యాఖ్యానించాడు.
ఇప్పటికే ఆ మహిళ అప్పటికే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు తిరగడం, ఒంటి నొప్పులతో బాధపడుతోంది. దీంతో ఇంత చిన్న వయసులోనే వరుసగా గర్భం దాల్చడం వల్ల వచ్చే తీవ్రమైన ప్రాణాపాయాల గురించి డాక్టర్ ఆ దంపతులను హెచ్చరించారు. కాన్పుకు, కాన్పుకు మధ్య కనీస సమయం లేకపోవడం వల్ల శరీరానికి విశ్రాంతి దొరకదు. దీనివల్ల తీవ్రమైన రక్తహీనత (Anemia), పోషకాహార లోపం, శారీరక క్షీణత ఏర్పడతాయని వైద్యురాలు వివరించారు. ఇన్నిసార్లు గర్భం దాల్చం, ప్రసవాలతోనే ప్రాణం మీదికి తెచ్చుకున్నారని, ఇది తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు.
ఇదీ చదవండి: దారుణం : కాఫీలో మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారం
నెటిజన్ల ఆగ్రహం
ఈ వీడియో వైరల్ కావడంతో, సమాజంలో మహిళలపై ఉన్న ఒత్తిడిని చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో ఇంకా బలంగా పాతుకుపోయిన "మగపిల్లాడిపై వ్యామోహం" లింగ వివక్షకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు."ఆమె ఒక వయస్కురాలిగా మారకముందే.. తల్లిగా మారిపోయింది" అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరు, "ఆ భర్త పరిస్థితి చూడండి. కనీసం కుటుంబానికి సరైన తిండి, బట్టలు, వసతి కూడా కల్పించలేని స్థితిలో ఉండి కూడా.. వంశాన్ని ఉద్ధరించడానికి ఇంకో కొడుకు కావాలంటున్నాడు, ఎందుకు?" అని ప్రశ్నించారు. గర్భనిరోధక సాధనాలపై అవగాహన లేకపోవడం, బాల్యవివాహాలు, ఫ్యామిలీ ప్లానింగ్ లోపించడం, కొడుకులు-కూతుళ్ల మధ్య చూపిస్తున్న వివక్షపై ప్రజలు గళమెత్తారు.
ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ


