న్యూఢిల్లీ: ‘నీట్ యూజీ’ పరీక్ష నిర్వహణ వైఫల్యంతో ఇప్పటికే పలు విమర్శలను ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఇప్పుడు మరో సమస్య చుట్టుముట్టింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్ ఐఏటీ) ప్రవేశ పరీక్షలను ఎన్టీఏ ఒకే రోజున అంటే జూన్ 7వ తేదీనే నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు జాతీయ స్థాయి పరీక్షలు ఒకే రోజు ఉండటంతో, తాము దేనిని ఎంచుకోవాలో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు.
పరీక్షల తేదీల క్లాష్తో సందిగ్ధంలో విద్యార్థులు
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే, జూన్ 7న ఈ రెండు పరీక్షలు ఒకే సమయంలో జరగడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే పరీక్షల వాయిదాలతో ఒత్తిడికి గురైన విద్యార్థులకు, ఈ తేదీల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఒకే సమయంలో రెండు వేర్వేరు పరీక్షా కేంద్రాలకు వెళ్లడం అసాధ్యమని, దీనిపై అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
ఎన్టీఏ తక్షణ స్పందన
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పందించింది. పరీక్షా షెడ్యూల్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థి వివరాలను వెంటనే cuet-ug@nta.ac.in ఈమెయిల్ ద్వారా పంపాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులకు తగిన సహాయం చేస్తామని హామీ ఇచ్చింది.
మొదలైన విమర్శలు, ఆందోళనలు
ఇప్పటికే సీయూఈటీ-యూజీ పరీక్షా నిర్వహణలో సాంకేతిక లోపాలు, బయోమెట్రిక్ సమస్యల కారణంగా వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు తాజాగా చోటుచేసుకున్న ఈ తేదీల వివాదంతో ఎన్టీఏ తీరుపై మరిన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ముందుగానే సమన్వయం చేసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఏ ఈ పరీక్షల విషయంలో ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందోనని విద్యార్థులు వేచి చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఎబోలా విలయం: రెండు రోజుల్లో రెండింతలైన కేసులు


