రాయిపూర్: ఛత్తీస్గఢ్ జీరాం వ్యాలీ మావోయిస్టుల దాడి కేసులో ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాడికి సంబంధించిన 10 మందికి మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 13 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పరివర్తన్ ర్యాలీ టార్గెట్గా ఈ దాడులు జరిగాయి.ఇందులో 32 మంది మృతి చెందారు. తాజాగా దీనికి సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చింది.
ఏం జరిగింది?
మే 25, 2013న పరివర్తన ర్యాలీ ముగించుకుని తిరిగి వస్తున్న కాంగ్రెస్ నేతల కాన్వాయ్పై బస్తర్ జిల్లాలోని దర్భా పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు అత్యంత కిరాతకంగా మెరుపు దాడి చేశారు. ఈ దుర్ఘటనలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నంద్కుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్, అప్పటీ ప్రతిపక్ష నేత మహేంద్ర కర్మ, మాజీ కేంద్రమంత్రి విద్యాచరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియర్తో సహా మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ సమయంలో 101 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు భారీస్థాయిలో పత్రాలను పరిశీలించారు.
జగదల్పూర్లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు జడ్జి అభయ్ సింగ్ రాజ్పుత్, ఇద్దరు మహిళలు సహా మొత్తం 10 మంది దోషులుగా నిర్ధారించి ఈ మేరకు శిక్ష ఖరారు చేశారు. హైకోర్టు ధృవీకరణ తర్వాతే ఈ మరణశిక్ష అమలవుతుందని, దోషులు 30 రోజుల్లోపు హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉందని కోర్టు స్పష్టం చేసింది.


