‘చతుర్ముఖ’ వ్యూహాన్ని ఛేదిస్తేనే పీఠమెక్కేది..!  | Bihar political future depends on control over 4 major regions | Sakshi
Sakshi News home page

‘చతుర్ముఖ’ వ్యూహాన్ని ఛేదిస్తేనే పీఠమెక్కేది..! 

Nov 2 2025 4:54 AM | Updated on Nov 2 2025 4:54 AM

Bihar political future depends on control over 4 major regions

4 ప్రధాన రీజియన్‌లలో పట్టుపైనే బిహార్‌ రాజకీయ భవిత 

సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి (బిహార్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) 

బిహార్‌ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి. మరోమారు పట్నా గద్దెనెక్కేందుకు నితీశ్‌ ఉవి్వళ్లూరుతుంటే ప్రస్తుత ఎన్నికల సంగ్రామంలో ఆయనను పడొగొట్టేందుకు ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌ వ్యూహాలు రచిస్తున్నారు. సమరంలో ఎవరు గట్టెక్కుతారో నిర్ణయించే గెలుపు వ్యూహాలు మాత్రం రాజధాని పాటలీపుత్రలో కాకుండా రాష్ట్రంలోని నాలుగు విభిన్న ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి సమీకరణాల్లో దాగి ఉన్నాయి. 

సీమాంచల్‌లోని మతపరమైన ఓటు బ్యాంకు, మిథిలాంచల్‌లోని ఈబీసీల మద్దతు, మగద్‌లోని దళిత ఓటర్లు, భోజ్‌పుర్‌లోని గ్రామీణ–పట్టణ వ్యత్యాసాలు అనే ఈ 4 అంశాలపైనే అధికార, విపక్ష కూటముల భవిష్యత్‌ ఆధారపడి ఉంది. నితీశ్‌ పాలనపై తీర్పుతో పాటు కుల, ప్రాంతీయ అస్తిత్వాల మధ్య జరుగుతున్న ఈ పోరు అటు ఎన్‌డీఏ, ఇటు ఇండియా కూటములకు అసలుసిసలు పరీక్ష పెడుతోంది. కుల సమీకరణాల పునాదులపై జరుగుతున్న ఈ ఎన్నికల సమరంలో, ఎన్డీఏ ‘డబుల్‌ ఇంజిన్‌’నినాదం, మహాగఠ్‌బంధన్‌ ‘సామాజిక న్యాయం’హామీ రెండూ పదునైన అ్రస్తాలే.

సీమాంచల్‌:  మహాగఠ్‌బంధన్‌ కోటలో ‘చీలిక’గండం 
సీమాంచల్‌లో కిషన్‌గంజ్, అరేరియా, పూరి్నయా, కతిహార్‌ అనే నాలుగు ఉపప్రాంతాలున్నాయి. మొత్తంగా ఇక్కడ దాదాపు 28 స్థానాలున్నాయి సీమాంచల్‌ అనేది బిహార్‌లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతం. కిషన్‌గంజ్‌లో దాదాపు 70 శాతం జనాభా ముస్లింలు కాగా, ఇతర జిల్లాల్లో 35–45 శాతం వరకు ఉంటారు. ఇది సహజంగానే ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమికి కంచుకోట. ‘ముస్లిం –యాదవ్‌’సమీకరణంలో ‘ముస్లిం’ఓటు బ్యాంకు ఇక్కడ అత్యంత బలంగా ఉంది. అయితే గత ఎన్నికల్లో అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఇక్కడ 5 స్థానాలను గెలుచుకుని, మహాగఠ్‌బంధన్‌ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. 

ఈసారి 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహాగఠ్‌బంధన్‌ ఓట్ల ఏకీకరణే లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీని ఓడించాలంటే తమ కూటమికి పడే ఓట్లు చీలకుండా కాపాడుకోవాలని మహాగఠ్‌బంధన్‌ చూస్తోంది. ఎంఐఎం అనేది బీజేపీ ‘బీ–టీమ్‌’అని, ఓట్లు చీల్చడానికే వచ్చిందని ప్రచారం చేస్తూ, తమ సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మహాగఠ్‌బంధన్‌ కూటమి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఎన్డీఏ పూర్తిగా మహాగఠ్‌బంధన్‌ ఓట్లు ఎంత ఎక్కువగా చీలితే తమకు అంత లాభం చేకూరుతుందని ఎన్‌డీఏ కూటమి భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు గాలమేస్తోంది.  

మిథిలాంచల్‌:  నితీశ్‌కు అసలు సిసలు అగ్నిపరీక్ష 
మిథిలాంచల్‌లో ప్రధానంగా దర్భంగా, మధుబని, సమస్తిపూర్, సహర్సా, సుపాల్, మధేపుర ప్రాంతాలున్నాయి. మొత్తంగా ఇక్కడ దాదాపు 50–60 స్థానాలున్నాయి. ఇది అత్యంత సంక్లిష్టమైన సామాజిక సమీకరణాలున్న ప్రాంతం. బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు (బీజేపీ ఓటు బ్యాంకు), యాదవులు (ఆర్జేడీ బలం) ఇక్కడ బలంగా ఉన్నారు. అయితే, ఫలితాలను శాసించేది మాత్రం ఈబీసీ (అత్యంత వెనుకబడిన వర్గాలు). మల్లా, టెలీ, ధానుక్‌ వంటి అనేక చిన్న కులాలు సీఎం నితీశ్‌ కుమార్‌కు అండగా నిలుస్తున్నాయి. అయితే ‘సన్‌ ఆఫ్‌ మల్లా‘గా పిలుచుకునే ముఖేశ్‌ సహానీకి నిషాద్‌ కమ్యూనిటీపై గట్టి పట్టుంది. ఈయన ప్రస్తుతం మహాగఠ్‌బంధన్‌ కూటమిలో ఉండటం వారికి కలిసి రానుంది. 

ఈ ప్రాంతంలో ఎన్డీఏ తన సంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడుగా ఈబీసీలను కలుపుతోంది. నితీశ్‌ను ముందు నిలిపి ఈబీసీ ఓట్లను, అగ్రవర్ణాల ఓట్లను కొల్లగొట్టాలని ఎన్డీఏ ఆశపడుతోంది. ఈ కూటమి 2020లో మెరుగైన ప్రదర్శన చేసి 34 సీట్లు గెలుచుకుంది. మహాగఠ్‌బంధన్‌ మాత్రం ’సహానీ’తో ఎన్డీఏ ఓట్లకు గండి కొట్టే ప్లాన్‌ చేస్తోంది. ముస్లిం, యాదవ్‌లతోపాటు ఈసారి మల్లాలను, వామపక్ష పారీ్టలకు దగ్గరగా ఉన్న శ్రామిక వర్గాలను ఏకం చేయాలని విపక్షపారీ్టలు ఆశిస్తున్నాయి. నితీశ్‌పై ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఈబీసీ ఓట్లను తమ వైపు తిప్పుతుందని మహాగఠ్‌బంధన్‌ గట్టిగా నమ్ముతోంది. ఇది నితీశ్‌ విశ్వసనీయతకు అసలైన పరీక్ష.

మగధ్‌:  ‘లెఫ్ట్‌’జోరుకు కళ్లెం! 
మగధ్‌ ప్రాంతంలో గయా, జెహానాబాద్, ఔరంగాబాద్, నవాడా, అర్వాల్‌ అనేవి ముఖ్యమైనవి. ఇక్కడ సుమారు 28 స్థానాలున్నాయి. మగధ్‌ ప్రాంతం ఆర్జేడీ, వామపక్షాలకు కంచుకోట. ఇక్కడ యాదవులు, దళితులు/మహాదళితులు (ముసహర్, పాశ్వాన్‌), భూమిహార్ల జనాభా ఎక్కువ. ఈ ప్రాంతంలో సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీకి బలమైన కేడర్‌ ఉంది. 2020లో ఎన్డీఏ ఇక్కడ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ప్రాంతంలోని 26 స్థానాల్లో మహాగఠ్‌బంధన్‌(ముఖ్యంగా ఆర్జేడీ, సీపీఐ –ఎంఎల్‌) ఏకంగా 20 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈ ప్రాంతాల్లో ఎన్‌డీఏలోని జితన్‌ రాం మాంఝీ (హెచ్‌ఏఎం పారీ్ట), చిరాగ్‌ పాశ్వాన్‌ (లోక్‌జనశక్తి– పాశ్వాన్‌) గత కొంతకాలంగా బలాన్ని పుంజుకుంటున్నారు. 

ఈ దళిత మిత్రుల సాయంతో 2020 నాటి ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎన్‌డీఏ కూటమి కంకణం కట్టుకుంది. గయా ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి మాంఝీ (ముసహర్‌ నేత), చిరాగ్‌ పాశ్వాన్‌ (పాశ్వాన్‌ నేత) ద్వారా విపక్షాల దళిత ఓటు బ్యాంకును చీల్చాలని ఎన్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. మహాగఠ్‌బంధన్‌ మాత్రం ‘ఆర్జేడీ (యాదవ్‌), సీపీఐ–ఎంఎల్‌ (అణగారిన వర్గాలు/దళితులు) అనే విజయవంతమైన ఫార్ములాను నమ్ముకుంది. ఈసారి కూడా తమను అదే ఫార్ములా విజయతీరాలకు చేర్చనుందని బలంగా నమ్ముతోంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మగధ్‌ ప్రాంతంలో తప్పనిసరిగా మోదీ మ్యాజిక్‌ పనిచేయాల్సిందే. 2020లో గెలిచిన ఆరు సీట్లను పెంచుకుని ఈసారి కనీసం 15 సీట్లలో విజయపతాక ఎగరేస్తేనే అధికారంపై ఆశలు బలపడతాయి.

భోజ్‌పూర్‌:  నగరాలపై ‘కమలం’ఆశ 
భోజ్‌పూర్‌ పరిధిలో పట్నా, భోజ్‌పుర్‌(ఆరా), రోహ్‌తాస్, బక్సర్, కైమూర్‌ ప్రాంతాలున్నాయి. ఇక్కడ మొత్తంగా దాదాపు 46 స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని రాజ్‌పుత్‌ల గడ్డగా పిలుస్తారు. అగ్రవర్ణాలలో రాజ్‌పుత్‌ల ఆధిపత్యం ఎక్కువ. ఆర్‌జేడీకి మద్దతుగా నిలబడే యాదవ్, జేడీయూకు మద్దతుగా నిలిచే కుర్మీ–కోయిరీల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది. పటా్నలోని పట్టణ ఓటర్లు (కాయస్థులు, బనియాలు) బీజేపీకి మద్దతునిస్తున్నారు.

 2020లో మగధ్‌ లాగే భోజ్‌పుర్‌ గ్రామీణ ప్రాంతాల్లో మహాగఠ్‌బంధన్‌ అద్భుతమైన ప్రదర్శన చేసి 43 స్థానాలకు గాను ఏకంగా 30 చోట్ల విజయం సాధించడం విశేషం. ఇక్కడ పట్టు సాధించేందుకు ఎన్డీఏ పట్టణ ఓటును, అగ్రవర్ణాలను ఏకీకరణ చేస్తూనే ఈబీసీ, ఓబీసీలను కలుపుకుపోయే ఫార్ములాతో బరిలోకి దిగుతోంది. మహాగఠ్‌బంధన్‌ మాత్రం గ్రామీణ పట్టు నిలుపుకునే యత్నం చేస్తోంది. ఈ చతుర్ముక పోరులో విజయం సాధించేది ఎవరో తెలియాలంటే ఫలితాల వెల్లడిదాకా ఆగక తప్పదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement