చెన్నై: రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కీలక ప్రకటన చేశారు. "వీ ది లీడర్స్" అనే స్వచ్ఛంద సంస్థను త్వరలోనే రాజకీయ పార్టీగా మార్చే మార్చేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో జరిగిన ఒక సంభాషణలో అన్నామలై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మార్పు జూలై, నాటికి జరగవచ్చని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమాల్లో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ "మేము ఈ ఉద్యమాన్ని ఒక రాజకీయ సంస్థగా ప్రారంభించిన తర్వాత, ఈ జూలై నుంచి దాని కార్యకలాపాలు వేరే రూపాన్ని సంతరించుకుంటాయి, ప్రజలు దానిని గమనించబోతున్నారు వీ ది లీడర్ ఎట్టి పరిస్థితుల్లో విఫలం కాదు, అబద్ధం చెప్పదు, ప్రజలను తప్పుడు మార్గంలోకి నడిపించదు" అని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ ఉద్యమంపై ఎలాంటి వ్యక్తిగత అంచనాలు లేకపోయినప్పటికీ దాదాపు 18 లక్షల మంది ఇందులో చేరారని ఆయన అన్నారు. తమిళనాడు వ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ఫారమ్లు, ప్రచారాల ద్వారా తమ కార్యక్రమానికి విపరీతమైన మద్ధతు లభిస్తోందన్నారు.తమకు పార్టీకి అన్ని మతాలు సమానమేనని దానిపైన మరో ఆలోచన లేదన్నారు.
రాబోయే నెలల్లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరింత ఉదృతంగా కొనసాగాలన్నదే తన లక్షమని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిభ ఉన్న తమిళులకు రాజకీయాల్లో ప్రవేశించాలని ఉందని కాని వారికి ఆ మార్గం తెలియడం లేదని అన్నామలై పేర్కొన్నారు. పాతవాటిని తొలగించి కొత్తవాటిని తీసుక వస్తేనే మార్పు జరుగుతుందని అన్నామలై ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐపీఎస్ను వీడీ రాజకీయాల్లోకి
2020 ఆగస్టులో బీజేపీలో చేరడం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచింది. పార్టీలో చేరిన తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. యువతను ఆకర్షించే ప్రసంగాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో తమిళనాడులో బీజేపీకి కొత్త ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాగా. గత కొంతకాలంగా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడిచింది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే పొత్తును ఆయన వద్దన్నారని.. ఆ ఎఫెక్ట్తోనే (పళనిస్వామి ఒత్తిడితోనే) ఆయన్ని బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తప్పించారని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోగా.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన క్రియాశీలకంగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి గుడ్బై చెప్పి కొత్తపార్టీ పెట్టబోతున్నారు.


