పది నిమిషాల ఆలస్యం.. నేను ప్రాణాలతో ఉన్నా: భూమి చౌహాన్‌ | Bhoomi Chauhan Woman Who Missed Air India Flight By Just 10 Minutes, Says Incident Is Absolutely Terrifying | Sakshi
Sakshi News home page

పది నిమిషాల ఆలస్యం.. నేను ప్రాణాలతో ఉన్నా: భూమి చౌహాన్‌

Jun 13 2025 7:16 AM | Updated on Jun 13 2025 1:54 PM

Air India flight Miss just 10 minutes Bhoomi Chauhan lucky escape

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాద సమయంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కూడా ఉన్నారు. అయితే పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. విమాన ప్రమాదం నుంచి తనను దేవుడే రక్షించాడని ఆమె చెప్పుకొచ్చింది.

వివరాల ప్రకారం.. భూమి చౌహాన్‌ అనే యువతి అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లడానికి ఎయిరిండియా (Air India) ఫ్లైట్‌ AI171 బుక్‌ చేసుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. దీంతో ఆమెకు పదినిమిషాల ఆలస్యం అయింది. అప్పటికే ఆ ఫ్లైట్‌ టేకాఫ్‌ అయి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. దీంతో, ఈ ప్రమాదంపై భూమి చౌహన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా..‘ట్రాఫిక్‌ కారణంగా నేను విమానం మిస్‌ అయ్యాను. ఇదే సమయంలో నేను వెళ్లాల్సిన విమానం కుప్పకూలిందనే విషయం తెలిసిన వెంటనే షాక్‌కు గురయ్యా. ఆ ఘటన గురించి తలుచుకుంటే నా శరీరం వణుకుతోంది. ఈ ప్రమాద ఘటనపై మాట్లాడలేకపోతున్నా. నా మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. ఆ దేవుడికి ధన్యవాదాలు. గణపతి బప్పానే నన్ను కాపాడాడు. పది నిమిషాలు ఆలస్యం కావడం వల్ల నేను విమానం ఎక్కలేకపోయాను. విమాన ప్రమాద విషయాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.

ఇక, పది నిమిషాల ఆలస్యంతో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విమానాశ్రయం చేరుకున్న చౌహాన్‌.. మధ్యాహ్నం 1.30 గంటకు ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయటకు వచ్చింది. 1.38 నిమిషాలకు టేకాఫ్‌ అయిన విమానం క్షణాల్లోనే ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లోని నివాసప్రాంతంలో కుప్పకూలింది. లండన్‌లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్‌ రెండేళ్ల అనంతరం వెకేషన్‌ కోసం ఇండియా వచ్చింది.

ఇదిలా ఉండగా.. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. విమానం మెడికోలు ఉంటున్న భవనంపై పడడంతో అందులో ఉంటున్న 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement