లండన్‌కు చేరాక ఫోన్‌ చేస్తా.. | Air India flight crash: Dreams cut short in Ahmedabad plane crash | Sakshi
Sakshi News home page

లండన్‌కు చేరాక ఫోన్‌ చేస్తా..

Jun 14 2025 6:00 AM | Updated on Jun 14 2025 6:00 AM

Air India flight crash: Dreams cut short in Ahmedabad plane crash

తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకోకుండానే..

ప్రాణాలు కోల్పోయిన డ్రీమ్‌లైనర్‌ ఉద్యోగి మైథిలి

12 మంది సిబ్బందిలో 9 మంది మహారాష్ట్ర వాసులే

ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ

ముంబై: అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల హృదయవిదారక విషాద గాథలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌ క్యాబిన్‌ క్రూలో పనిచేసే మైథిలీ పాటిల్‌(23) తన తండ్రి మోరేశ్వర్‌ పాటిల్‌కు గురువారం మధ్యాహ్నం చివరిసారిగా ఫోన్‌ చేశారు. లండన్‌ చేరుకున్నాక మళ్లీ చేస్తానంటూ ఆయన్ను అనునయించారు. కానీ, కొద్ది గంటల్లోనే ఘోరం జరిగిపోయింది. 

ఆమె తన మాట నెరవేర్చకుండానే తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయారు. డ్రీమ్‌లైనర్‌లో క్రూ సిబ్బందిలో ప్రాణాలు కోల్పోయిన 12 మందిలో మైథిలి ఒకరు. అంతేకాదు, వీరిలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం 9 మంది క్రూ సిబ్బంది మహారాష్ట్రకు చెందిన వారే కావడం గమనార్హం. నవా గ్రామానికి చెందిన మైథిలి రెండేళ్ల క్రితం ఎయిరిండియాలో జాయినయ్యారు. ఈమె తండ్రి మోరేశ్వర్‌పాటిల్‌ ఓఎన్‌జీసీ లేబర్‌ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. 

లండన్‌ చేరుకున్న వెంటనే ఫోన్‌ చేస్తానంటూ మైథిలి దుర్ఘటనకు కొద్దిసేపటి ముందే తండ్రికి ఫోన్‌ చేసి చెప్పారని ఆమె బంధువు, నవా గ్రామ మాజీ సర్పంచి జితేంద్ర మాత్రే చెప్పారు. క్యాబిన్‌ క్రూ మరో సభ్యుడు దీపక్‌ పాఠక్‌ థానె పక్కనే ఉన్న బద్లాపూర్‌ నివాసి. ఎయిరిండియాలో 11 ఏళ్లుగా పనిచేస్తున్న పాఠక్‌ లండన్‌ వెళ్లేముందుకు తల్లికి ఫోన్‌ చేసి మాట్లాడారని ఆయన సోదరి చెప్పారు. 

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన క్రూ సభ్యుడు అపర్ణా మహదిక్‌(43)కి కూడా ముంబై సమీప గోరెగావ్‌ ప్రాంతమే. ఈమె భర్త కూడా ఎయిరిండియా క్రూ సభ్యుడిగా పనిచేస్తున్నారు. అపర్ణకు ఎన్‌సీపీ నేత సునీల్‌ తత్కారేకు బంధువు. విమానం క్రూ సభ్యుల్లో ఒకరైన ఇర్ఫాన్‌ సమీర్‌ షేక్‌(22) రెండేళ్ల క్రితమే ఎయిరిండియాలో జాయినయ్యారు. ఈయన ఎన్నో కలలు కన్నారని కుటుంబసభ్యులు కన్నీరమున్నీరవుతున్నారు. 

షేక్‌ కుటుంబం పుణె నగరం పింప్రి చించ్‌వాడీలో ఉంటోంది. క్రూలో మరో సభ్యురాలు శ్రద్ధా ధావన్‌ది ములుండ్‌లోని వైశాలి నగర్‌. ధావన్‌ మరణ వార్త తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు డీఎన్‌ఏ నమూనాలు ఇచ్చేందుకు అహ్మదాబాద్‌కు వెళ్లారు. విమాన క్యాబిన్‌ క్రూ సభ్యుల్లో రోష్ని రాజేంద్ర సొంఘారె డొంబివిలి ప్రాంతంలో ఉంటుండగా, సాయినీత చక్రవర్తి జుహు కొలివాడకు చెందిన వారు.

 ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కూడా అయిన సొంఘారేకు ఇన్‌స్టాలో 54 వేలకు పైగా ఫాలోయర్లున్నారు. ప్రమాదంలో చనిపోయిన పైలట్‌ సుమీత్‌ పుష్కరాజ్‌ సభర్వాల్‌(56) ముంబైలోని పొవైలో జల్‌ వాయు విహార్‌లో వృద్ధులైన తల్లిదండ్రులతో ఉంటున్నారు. విమానం కో–పైలట్‌ క్లైవ్‌ కుందర్‌ది కూడా ముంబైనే. శాంటాక్రుజ్‌ ప్రాంతంలోని కలినాలో జెరోమ్‌ అపార్టుమెంట్‌లో నివసిస్తున్నారు.  

భర్తతో కలిసి గడపాలని.. 
గుజరాత్‌లోని మెహ్‌సనాకు చెందిన అంకితా పటేల్‌ది మరో విషాదం. ఈమెకు గతేడాది డిసెంబర్‌లో పెళ్లయింది. భర్త వసంత్‌ లండన్‌లో ప్రొవిజన్‌ స్టోర్‌ యజమాని. ఈ నూతన దంపతులు కలిసి గడిపింది కేవలం 12 రోజులు మాత్రమే. వసంత్‌ లండన్‌ వెళ్లిపోవడంతో, తనూ అక్కడికి వెళ్లి భర్తతో గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. తన తల్లిదండ్రులు, సోదరుడితోపాటు వసంత్‌ సోదరితో కలిసి వీసా కోసం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. 

అంకితను లండన్‌ పంపించేందుకు వీరంతా గురువారం విమానాశ్రయానికి వచ్చారు. ఆమెకు గుడ్‌ బై చెప్పి మెహ్‌సనాకు బయలుదేరిన కొద్దిసేపటికే ఘోరం జరిగిపోయిందని వసంత్‌ సోదరి ఆశాబెన్‌ పటేల్‌ చెప్పారు. వెంటనే తిరిగి వచ్చామన్నారు. గాట్విక్‌ విమానాశ్రయంలో భార్యకు ఘనస్వాగతం పలకాల్సిన వసంత్‌..బదులుగా ఆమె అవశేషాలను తీసుకునేందుకు వస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించేందుకు అధికారులు అంకిత సోదరుడి డీఎన్‌ఏ నమూనాలు తీసుకున్నట్లు వివరించారు. 

ప్రయాణాలంటే ఎంతో సరదా.. 
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన నీరజ్‌ లవానియా(50), అపర్ణ దంపతులకు ప్రయాణాలంటే ఎంతో ఇష్టం. ఈ వేసవి సెలవుల్లో లండన్‌ వెళ్లాలనుకున్నారు. వీరితోపాటు 18 ఏళ్ల కుమార్తె కూడా వెళ్లాల్సి ఉంది. అయితే, ఒంటరిగా ఉండే 70 ఏళ్ల నీరజ్‌ తల్లిని చూసుకునేందుకని ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. లండన్‌ వెళ్లేందుకు ఎయిరిండియా విమానమెక్కిన లవానియా దంపతులు ప్రాణాలు కోల్పోయారు. 

డిగ్రీ ఫైనలియర్‌ చదువుకుంటున్న వీరి కూతురు తల్లిదండ్రుల అవశేషాలను గుర్తుపట్టేందుకు అహ్మదాబాద్‌ వెళ్లి అధికారులకు డీఎన్‌ఏ నమూనా ఇచ్చారు. ఆగ్రాలోని అకోలాకు చెందిన నీరజ్‌ 1995లో ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ కోసమని వడోదరకు మకాం మార్చారు. చుట్టుపక్కల వారితో ఎంతో కలుపుగోలుగా ఉండే నీరజ్‌ మరణ వార్త విని అకోలా వాసులు సైతం విషాదంలో మునిగిపోయారు. విమాన ప్రయాణానికి కొద్దిసేపటి ముందే 1.30 గంటల సమయంలో తనతో నీరజ్‌ మాట్లాడాడని సోదరుడు సతీశ్‌ చెప్పారు. టీవీలో వచ్చిన వార్తను చూసి షాక్‌కు గురయ్యానన్నారు.

కుమారుడి వద్ద గడిపేందుకని..
డ్రీమ్‌లైనర్‌ ప్రమాద మృతుల్లో మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా వాసి మహదేవ్‌ పవార్‌(68), ఆశా(60) దంపతులు కూడా ఉన్నారు. సంగోలా తెహశీల్‌లోని హటిడ్‌ గ్రామానికి చెందిన మహదేవ్‌ గుజరాత్‌లోని నడియాడ్‌లోని టెక్స్‌టైల్‌ మిల్లులో పని చేసేవారు. ఈయనకు ఇద్దరు కుమారులు. ఒకరు అహ్మదాబాద్‌లో, మరొకరు లండన్‌లో ఉంటున్నారు. లండన్‌లో నివసిస్తున్న కుమారుడి వద్దకని బయలుదేరిన ఈ దంపతులు విమాన ప్రమాదం బారినపడ్డారు. వీరు అహ్మదాబాద్‌లో 15 ఏళ్లుగా నివసిస్తున్నారని సోలాపూర్‌ జిల్లా అధికారి ఒకరు తెలిపారు. ఈ దంపతులు ఇటీవలే హటిడ్‌లో ఉంటున్న బంధువుల వద్దకు వచ్చి వెళ్లారని చెప్పారు.

భర్త బర్త్‌డే కోసం.. 
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన హర్‌ప్రీత్‌ కౌర్‌ హొరొ(28) ఐటీ నిపుణురాలిగా బెంగళూరులో పనిచేస్తున్నారు. ఈమె భర్త రొబ్బీ హొరా లండన్‌లోని ఐటీ కంపెనీలో ఉద్యోగి. ఈనెల 16న రొబ్బీ పుట్టినరోజు. వాస్తవానికి హర్‌ప్రీత్‌ ఈ నెల 19న లండన్‌ వెళ్లాల్సి ఉంది. అయితే, భర్త పుట్టిన రోజు వేడుక కోసమని ముందుగానే ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌లో టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నారు. లండన్‌ వెళ్లాక దంపతులు యూరప్‌ టూర్‌ కూడా ప్లాన్‌ చేసుకున్నారని బంధువులు చెప్పారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని, వీరి కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిపోయాయని బంధువులు చెప్పారు.

టీస్టాల్‌ యజమాని 14 ఏళ్ల కుమారుడు.. 
డ్రీమ్‌లైనర్‌ ప్రమాదం అహ్మదాబాద్‌ మెఘానీనగర్‌ ప్రాంతం బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌కు సమీపంలోని చెట్టు కింద టీకొట్టు నడుపుకునే కుటుంబంలో తీరని విషాదం నింపింది. విమానం కూలిన సమయంలో సీతా బెన్‌ టీ తయారు చేస్తుండగా ఆమె కుమారుడు 14 ఏళ్ల ఆకాశ్‌ పట్ని పక్కనే నిద్రిస్తున్నాడు. కూలిన విమాన లోహ శకలం ఒకటి వచ్చి ఆకాశ్‌ తలను తాకింది. ఆ వెంటనే చెలరేగిన మంటల్లో ఆకాశ్‌ మాడి మసయ్యాడు ఆకాశ్‌. కుమారుడిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో తల్లి సీతా బెన్‌ తీవ్రంగా గాయపడి ఆస్ప త్రిలో చికిత్స పొందుతోంది.

అంతా బాగుందని చెప్పి అంతలోనే.. 
గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉండే సురేశ్‌ మిస్త్రీ అహ్మదాబాద్‌ బీజే మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో వద్ద డీఎన్‌ఏ నమూనా ఇచ్చేందుకు క్యూలో ఉన్నారు. ఈయన కుమార్తె 21 ఏళ్ల క్రినా మిస్త్రీ విమాన ప్రమాదంలో చనిపోయింది. వర్క్‌ వీసా రావడంతో ఏడాది క్రితం లండన్‌ వెళ్లిన క్రినా ఇటీవలే ఆనంద్‌కు తిరిగి వచ్చింది. వైద్య చికిత్స అనంతరం డ్రీమ్‌లైనర్‌లో లండన్‌ తిరిగి పయనమయ్యింది. విమానం ఎక్కాక కూడా తండ్రికి ఫోన్‌ చేసి నిశ్చింతగా ఇంటికి వెళ్లండంటూ ధైర్యం చెప్పింది. ఇంటికి వెళ్లాక దుర్వార్త తెలిసిందని, క్రినా ఇక లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నట్లు సురేశ్‌ గద్గద స్వరంతో చెప్పారు.

తిరిగొచ్చాక భారీగా వేడుక చేద్దామని..
గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర విషాదంలో అసువులు బాసిన వారిలో భవిక్‌ మహేశ్వరి(26) అనే నవ వరుడు కూడా ఉన్నారు. లండన్‌లో పనిచేసే భవిక్‌ 15 రోజులక్రితమే వడోదరకు వచ్చారు. పెళ్లి చేసుకున్నాకే తిరిగి లండన్‌ వెళ్లాలని కుటుంబసభ్యులు పట్టుబట్టడంతో వారి కోరిక మేరకు జూన్‌ 10న ఓ యువతితో చాలా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత నవ వధువును లండన్‌ పంపేందుకు ఏర్పాట్లు సైతం మొదలయ్యాయి. మరోసారి వివాహ వేడుకను భారీగా నిర్వహించాలని ప్లాన్‌ చేసుకున్నారు. నూతన వధువు సహా కుటుంబసభ్యులంతా గురువారం అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో భవిక్‌కు వీడ్కోలు పలికారు. వారి తిరిగి ఇళ్లకు చేరుకున్నారో లేదో ఘోరం జరిగిపోయింది. ఈ విషాదాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని బంధువొకరు తెలిపారు.

ఏకైక కెనడియన్‌ నిరాలీ పటేల్‌..
అహ్మదాబాద్‌ విషాద బాధితుల్లో కెనడా పౌరురాలు ఒకరుండటం తెల్సిందే. ఈమె భారత సంతతికి చెందిన నిరాలీ పటేల్‌(32). టొరంటోని ఎటోబికోక్‌లో ఉండే నిరాలీ సోషల్‌ ట్రిప్‌లో భాగంగా భారత్‌కు వచ్చారు. నిరాలీ మరణవార్త తెల్సిన భర్త, ఏడాది వయస్సున్న కుమార్తెతో భారత్‌కు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఈమె తల్లిదండ్రులు, సోదరుడి కుటుంబం బ్రాంప్టన్‌లో నివస్తున్నారు. భారత్‌లో 2016లో దంత వైద్యంలో డ్రిగీ పొందిన నిరాలీ 2019లో కెనడా వెళ్లారు. మిస్సిస్సౌగాలో డెంటల్‌ క్లినిక్‌ నడుపుతున్నారు. నిరాలీ మృతి పట్ల కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ, విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌ సంతాపం ప్రకటించారు.  

అంత్యక్రియలకు బయల్దేరి అనంతలోకాలకు 
అహ్మదాబాద్‌/నాగ్‌పూర్‌: అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు అంత్యక్రియల కోసం వెళ్తున్న కుటుంబంలోని ముగ్గురు విమాన ప్రమాదంలో మరణించారు. నాగపూర్‌కు చెందిన 32 ఏళ్ల యశా కామ్‌దార్‌కు నాలుగేళ్ల కిందట అహ్మదాబాద్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. అప్పటినుంచి ఆమె అహ్మదాబాద్‌లోనే నివసిస్తున్నారు. మామ కిషోర్‌ మోదా చాలాకాలంగా లండన్‌లో ఉంటున్నారు. ఆయన అంత్యక్రియల కోసం ఒకటిన్నరేళ్ల కొడుకు, 58 ఏళ్ల అత్త రక్షతో కలిసి ఆమె లండన్‌ బయల్దేరి ముగ్గురూ ప్రమాదానికి బలయ్యారు. దాంతో యశా కుటుంబం, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాగపూర్‌లోని ఆమె తల్లిదండ్రులు అహ్మదాబాద్‌ బయలుదేరారు.

లండన్‌ నుంచి పూర్తిగా వచ్చేయాలనుకుని..  
కోచి: విమాన ప్రమాదంతో మరణించిన 39 ఏళ్ల కేరళ నర్సు రంజితది మరో విషాద గాధ. కేరళ ప్రభుత్వ నర్సుగా చేసిన ఆమె సెలవు పెట్టి కొంతకాలం ఒమన్‌లో పని చేశాక బ్రిటన్‌ వెళ్లింది. లండన్‌లో నర్సుగా చేస్తోంది. కేరళలో కొత్తిల్లు కట్టుకుని కుటుంబానికి కొత్త జీవితం ఇవ్వాలని కలలు కంది. లండన్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి శాశ్వతంగా భారత్‌కు వచ్చేయాలనుకుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వారిని రంజిత తల్లి చూసుకుంటోంది. నాలుగు రోజుల క్రితమే కేరళ వచ్చింది. అక్కడ మళ్లీ తన ప్రభుత్వోద్యోగంలో చేరడానికి లాంఛనాలు పూర్తి చేసింది. 

లండన్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి సర్టిఫికెట్లు, సామగ్రి తెచ్చుకోవడానికి గురువారం చెన్నై నుంచి అహ్మదాబాద్‌ వెళ్లింది. లండన్‌కు ఎయిరిండియా విమానమెక్కి తిరిగిరాని లోకాలకు చేరింది. దాంతో పిల్లలు, తల్లి దిక్కులేనివారయ్యారు. కాగా, రంజితను కులపరంగా, లైంగికంగా వేధిస్తూ ఆన్‌లైన్‌లో అసభ్య పోస్టులు పెట్టిన కాసరగోడ్‌ జిల్లా వెల్లరికుందు డిప్యూటీ తహశీల్దార్‌ పవిత్రన్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఇతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. అతడు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడని, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement