
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రమాద బాధితులకు టాటా గ్రూప్ సంస్థ భారీగా పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడో మహిళ టాటా గ్రూప్ వాళ్లకే రెండు కోట్ల రూపాయలు ఎదురిస్తానంటోంది. బదులుగా.. చనిపోయిన తన తండ్రిని ప్రాణాలతో తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. నవ్వుతూ నిత్యం తమ మధ్య తిరిగిన తండ్రి.. తాజా ఘటనలో దుర్మరణం పాలై మృతదేహాం జాడ కూడా లేని స్థితిలో ఉన్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
‘‘నా తండ్రే పోయాక మీ పరిహారం ఎవరికి కావాలి. నేను వాళ్లకు రెండు కోట్ల రూపాయిలిస్తా. బదులుగా చనిపోయిన నా తండ్రిని బతికించి తీసుకురండి. వాళ్లు ఇచ్చే పరిహారం నా తండ్రిని వెనక్కి తెస్తుందా?.. నాకు నా తండ్రి, ఆప్యాయతలు కావాలి. వాటి కోసం వాళ్లలా ఎంతైనా నేను ప్రకటిస్తా’’ అంటూ ఫాల్గూని అనే మహిళ కన్నీరు పెట్టుకుంది.
ఫాల్గునితో పాటు బాధిత కుటుంబాలు అహ్మదాబాద్ బీజే మెడికల్ కాలేజీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత స్థితిలో కాలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రెండోరోజూ డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. అధికారులు బంధువుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ సేకరణ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నాం. ఫలితాలు రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని చెబుతున్నారు. ఎప్పుడు ఆ ఫలితాలు వచ్చేది?. . ఎప్పుడు మా వాళ్లను అప్పగించేది? అని ఫాల్గునితోపాటు మరికొందరు అధికారులను నిలదీశారు.
మరోవైపు.. అధికారులు మాత్రం తమ బృందాలు అహర్నిశలు పని చేస్తున్నాయని చెబుతున్నారు. ‘‘దాదాపుగా బంధువుల నుంచి శాంపిల్స్ సేకరించాం. ఇప్పటికే 240 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాం. డీఎన్ఏ మ్యాచింగ్ ప్రక్రియ పూర్తి కాగానే.. వీలైనంత త్వరగా మృతదేహాలు అప్పగిస్తాం’’ అని ఓ అధికారి వెల్లడించారు.