
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. ఈ ఘటనలో మృతిచెందినవారి విషాద గాథలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా వెల్లడికానప్పటికీ, ఈ ప్రమాదంతో ముడిపడిన అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం 1978 నాటి ‘ఎంపరర్ అశోక’ విషాదాన్ని పోలివుందనే కథనాలు తెరమీదకు వస్తున్నాయి. నాడు
ముంబైకి మూడు కి.మీ దూరంలో జరిగిన ‘ఎంపరర్ అశోక’ ప్రమాదంలో విమానంలోని 213 మంది కన్నుమూశారు. ఈ రెండు ఘటనల్లో విమానం బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే అవి కూలిపోయాయి.
1978, నూతన సంవత్సరం తొలిరోజున..
గురువారం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నివాస భవనాలపై ఎయిర్ ఇండియా విమానం ఏI 171, బోయింగ్ 787-8 ‘డ్రీమ్లైనర్’ కూలిపోయింది. ఈ ప్రమాదం దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ముంబై నుండి అరేబియా సముద్రంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం ఏI 855, ‘ఎంపరర్ అశోక’ఘటనను పోలి ఉందని నిపుణులు చెబుతున్నారు. 1978, జనవరి 1.. నూతన సంవత్సరం తొలిరోజున ఎయిర్ ఇండియా మొట్టమొదటి బోయింగ్ 747 అయిన ‘ఎంపరర్ అశోక’ ముంబైలోని శాంటా క్రజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం) నుండి దుబాయ్కి బయలుదేరింది. 190 మంది ప్రయాణికులు, 23 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత, ఎనిమిది వేల అడుగుల ఎత్తునకు చేరేందుకు అనుమతి లభించిన తర్వాత అరేబియా సముద్రం మీదుగా ప్రయాణం సాగిస్తోంది. అయితే ఇంతలో అత్యంత ముఖ్యమైన యాటిట్యూడ్ డైరెక్టర్ ఇండికేటర్ (ఏడీఐ)పనిచేయలేదు.
నాడు సముద్రంలో.. నేడు జనావాసాల్లో..
దాదాపు 18 వేల విమాన గంటలు నడిపిన కెప్టెన్, మదన్ లాల్ కుకర్(51) వెంటనే ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విమానంలో మాజీ భారత వైమానిక దళ కమాండర్ ఇందు విర్మాణి(43) కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియాలోని అత్యంత సీనియర్ ఇంజనీర్లలో వారు ఒకరు. అలాగే అనుభవజ్ఞులైన ఫ్లైట్ ఇంజనీర్ ఆల్ఫ్రెడో ఫారియాకూడా విమానంలో ఉన్నారు. విమానం రాత్రిపూట అరేబియా సముద్రం మీదుగా ఉన్నందున, దృశ్య హోరిజోన్ సూచన లేకపోవడంతో కెప్టెన్ కుకర్ ఎడమ నియంత్రణ ఇన్పుట్లను ఉపయోగించి కుడి ఒడ్డును సరిచేశారు. విమానం 108 డిగ్రీల కోణంలో ఎడమవైపుకు తిరుగుతూనే దాదాపు 2,000 అడుగుల నుండి నిటారుగా దాదాపు 35-40 డిగ్రీల కోణంలో కిందకు పడిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 213 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇది జరిగిన 47 ఏళ్ల తర్వాత మొన్నటి జూన్ 12న మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం AI 171, బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. ‘ఎంపరర్ అశోక’ మాదిరిగానే ‘డ్రీమ్లైనర్’ కూడా విమానాశ్రయానికి సమీపంలోనే కూలిపోయింది. అయితే ఈసారి జనావాస ప్రాంతంలోకూలిపోయి, పెను విషాదాన్ని మిగిల్చింది.
ఇది కూడా చదవండి: Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై..