ఆదిత్య–ఎల్‌1 మొదటి కక్ష్య పెంపు విజయవంతం | Aditya-L1: ISRO completes first earth-bound firing to raise orbit successful - Sakshi
Sakshi News home page

ఆదిత్య–ఎల్‌1 మొదటి కక్ష్య పెంపు విజయవంతం

Sep 4 2023 6:02 AM | Updated on Sep 4 2023 10:25 AM

Aditya-L1 first earth-bound firing to raise orbit successful - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం మధ్యాహ్నం సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ప్రయోగించిన ఆదిత్య –ఎల్‌1 ఉపగ్రహానికి మొదటిసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంపొందించింది. బెంగళూరులోని మిషన్‌ ఆపరేటర్‌ కాంఫ్లెక్స్‌ (ఎంఓఎక్స్‌), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌(ఇ్రస్టాక్‌), బైలాలులో ఉన్న ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ (ఐడీఎస్‌ఎన్‌) లాంటి భూనియంత్రత కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని అపోజి ఇంధనాన్ని మండించి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు.

శనివారం ప్రయోగం చేసినపుడు భూమికి దగ్గరగా 235 కిలోమీటర్లు, దూరంగా 19,500 కిలోమీటర్లు ఎత్తులో భూ మధ్యంతర కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొదటి విడత కక్ష్య దూరం పెంపుదలలో భూమికి దగ్గరగా 235 కిలోమీటర్ల నుంచి 245 కిలోమీటర్లకు పెంచారు. భూమికి దూరంగా ఉన్న 19,500 కిలోమీటర్ల దూరాన్ని 22,459 కిలోమీటర్లకు పెంచారు. అంటే ప్రస్తుతం 245‘‘22459 కిలోమీటర్లు దీర్ఘ వృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూరా పరిభ్రమిస్తూ ఉంది. రాబోయే 15 రోజుల్లో మరో నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచుతూ ఈనెల 18న భూ మధ్యంతర కక్ష్య నుంచి సూర్యుని వైపునకు మళ్లిస్తారు. అక్కడి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్‌ బిందువు 1 వద్దకు చేర్చడానికి 125 రోజులు సమయం తీసుకుంటుందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement