తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన! | 52 Kg Explosives Found Pulwama Type Attack Averted | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!

Sep 18 2020 10:19 AM | Updated on Sep 18 2020 10:28 AM

52 Kg Explosives Found Pulwama Type Attack Averted - Sakshi

శ్రీనగర్‌: పుల్వామా దాడితో భారత సైన్యంపై విరుచుకుపడిన ఉగ్రవాదులు మరోసారి అలాంటి పథకాన్నే రచించారు. అయితే, భద్రతా బలగాల ఉమ్మడి సెర్చ్‌ ఆపరేష్‌తో వారి కుట్రలు భగ్నమయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల సమయంలో గడీకల్‌ ప్రాంతంలోని కెవారాలో హైవే పక్కన 52 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించామని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. హైవే పక్కన ఉన్న పండ్లతోటలో భూమిలో పాతిపెట్టిన ప్లాస్టిక్‌ ట్యాంక్‌లో ఈ మొత్తం బయటపడిందని తెలిపింది. పుల్వామా ఘటన జరిగిన ప్రాంతానికి 9 కిలో మీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉందని వెల్లడించింది. 

125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. ఆ ప్రాంతంలోనే మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్‌లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. కాగా, 2019 ఫిబ్రవరి పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ఉగ్రవాదులు 35 కిలోల ఆర్‌డీఎక్స్‌ను మరికొన్ని జలెటిన్‌ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్టు వెల్లడైంది. పుల్వామా దాడి వెను జైషే చీష్‌ మసూద్‌ అజార్‌ ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తేల్చింది. ఇక పుల్వామా దాడికి ప్రతిగా భారత్‌ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడులు చేసి జైషే ఉగ్రవాద శిబిరాలను మారూపాల్లేండా చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement