
కోడే దూడలకు డిమాండ్..
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో ఉండే మేలుజాతి పశువులకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. అటవీ మేతతో దృఢంగా ఉండటం.. 20–25 ఏళ్లపాటు వ్యవసాయ పనులు చేసే సామర్థ్యం వీటి సొంతం. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడ్మిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర, లక్ష్మాపూర్, తిర్మలాపూర్, ఉప్పునుంతల, మాధవానిపల్లి, అమ్రాబాద్, మన్ననూర్, వట్టువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతోపాటు మల్లాపూర్, అప్పాపూర్, ఈర్లపెంట, మేడిమొల్కల, ఆగర్లపెంట, పుల్లాయిపల్లి, సంగండిగుండాలు చెంచుపెంటల్లో ఈ పశుజాతి ఉంది. ఆయా గ్రామాల రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ ప్రధాన వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు.
మన్ననూర్ గిత్తగా నామకరణం..
2016 డిసెంబర్ 27న అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ (బీకే)లో ఈ ప్రాంత రైతులతో కలిసి తెలంగాణ జీవ వైవిధ్య సంస్థతోపాటు వాన్సన్ స్వచ్ఛంద సంస్థ తూర్పుజాతి పశు ప్రదర్శన, పశు పెంపకందారుల సంఘం ఏర్పాటు చేశారు. ఆ రోజు నల్లమల అటవీ ప్రాంతంలోని పశుజాతికి మన్ననూర్ గిత్తగా నామకరణం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఒక్కో రైతుకు 100 నుంచి 300 వరకు పశువులు ఉండేవి. 50 వేలకుపైగా పశువులు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం 15 వేల వరకు మాత్రమే ఉన్నాయి. ఏటేటా ఈ అరుదైన పశుజాతి తగ్గిపోతోంది. ఇది వరకు నల్లమల అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా పశువులను మేపుకొనేవారు. అటవీశాఖ నిబంధనలు, అభ్యంతరాలతో పశుగ్రాసం కొరత ఏర్పడి.. పశుపోషణ భారంగా మారి చాలామంది వీటిని వదులుకుంటున్నారు.
వ్యవసాయ అనుబంధమైన పశుపోషణలో ఈ ప్రాంత రైతులు ప్రగతి సాధిస్తున్నారు. నల్లమల తూర్పు పశుసంపదకు తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, రాయచూర్తోపాటు కోస్గి, కొడంగల్ రైతులు దశాబ్దాల కాలంగా మేలుజాతి కోడెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు ఈ ప్రాంతంలో ఉంటూ పశువులను పరిశీలించి.. తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేస్తా రు. ప్రతి ఏటా దీపావళి తర్వాత జరిగే కురుమూర్తి జాతరలోనూ నల్లమల పశువులను అమ్ముతుంటారు. గతంలో జత గిత్తలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ధర ఉండగా.. ప్రస్తుతం రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది.
రైతులను ప్రోత్సహించాలి
నాకు 50 వరకు పశువులు ఉన్నాయి. నల్లమల రైతులకు పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం, నీటి కొరత ప్రధాన కారణంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పశుజాతిని సంరక్షించేందుకు పునరావాస, పశుగ్రాసం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పశువుల వల్ల అడవికి ఎలాంటి నష్టం ఉండదు. అడవిలో మేపుకొనేందుకు అనుమతి ఇవ్వాలి.
– శివాజీ గెలవయ్య,
మన్ననూర్, అమ్రాబాద్
వ్యవసాయ పనుల్లో మంచి నైపుణ్యం..
నల్లమల పొడ పశుజాతికి మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. వీటికి వ్యవసాయ పనుల్లో మంచి నైపుణ్యం ఉంటుంది. కష్టతరమైన పనులు సులువుగా చేస్తాయి. 34 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. – గెంటెల హన్మంతు,
పశువుల వ్యాపారి, తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు
సంతతి పెంచేందుకు కృషి..
నల్లమల పశువులకు మంచి డిమాండ్ ఉంది. తూర్పు పొడజాతి పశుసంతతి పెంచేందుకు కృషిచేస్తాం. మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. మచ్చల వైవిధ్యంపై పరిశోధన చేయించి, ఇక్కడ సంతనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఈ జాతిని సంరక్షించేందుకు ప్రభుత్వపరంగా చొరవ తీసుకుంటాం. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట
కొనసాగుతున్న పరిశోధనలు..
ఉమ్మడి రాష్ట్రంలో ఒంగోలు గిత్తకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ నల్లమల ప్రాంతంలోని మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పించాల్సి ఉంది. ఈ పశుజాతిపై ఏడాదిగా ప్రత్యేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. వీటికి తూర్పుజాతి పశువుగా గుర్తింపు లభించింది. రాష్ట్రానికి గర్వకారణమైన ఈ జాతికి అరుదైన గౌరవం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
రోగనిరోధక శక్తి ఎక్కువే..
నల్లమల పశువులకు రోగనిరోధక శక్తి అధికమే. అటవీ ప్రాంతంలో ఉండే ఔషధ మొక్కలు, రకరకాల మూలికలను ఈ పశువులు తినడం వల్ల రోగాలను తట్టుకునే శక్తి వీటికి అధికంగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునే శక్తి కూడా అధికమే. తక్కువ పశుగ్రాసంతో ఎక్కువ పనిచేస్తోంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా పనిచేసే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఈ పశువులకు త్వరగా అలసిపోయే గుణం ఉండదు. అటవీ ప్రాంతంలో పశువుల మందపై క్రూరమృగాలు దాడి చేసినా.. చురుకుగా తప్పించుకుంటాయి. తూర్పుజాతి పశువు వేడి, చలి వంటి వాతావరణం తట్టుకుని జీవిస్తాయి. ఇవీ ఎంతో తెలివైనవని.. వర్షం రాకను ముందే పసిగట్టి తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని పరిశోధనలో తేలిందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణ బ్రాండ్గా తూర్పుజాతి పశుసంపద
నల్లమల లోతట్టు ప్రాంతంలో మేలుజాతి పశువులు
మన్ననూర్ గిత్తకు వందేళ్లకుపైగా చరిత్ర
ఆదరణ కొరవడటంతో ప్రశ్నార్థకమవుతున్న మనుగడ
ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు కోసం ఎదురుచూపులు

కోడే దూడలకు డిమాండ్..

కోడే దూడలకు డిమాండ్..

కోడే దూడలకు డిమాండ్..

కోడే దూడలకు డిమాండ్..