
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
నారాయణపేట టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, చెరువు, శిఖం భూములు ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఎక్కడైనా ఆక్రమణకు గురైతే టోల్ ఫ్రీ నం.9154283914 కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో విచారించి నిబంధనలకు అనుగుణంగా చర్య లు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
రైతుల ఖాతాల్లో రూ.215 కోట్లు జమ
నారాయణపేట: జిల్లాలో ఇప్పటి 1,67,721 మంది రైతుల ఖాతాల్లో రూ.215 కోట్ల 15 లక్షలు రైతు భరోసా నగదు జమ అయ్యాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,83,500 మంది రైతులు అర్హులుగా గుర్తించబడ్డారని, కాగా ఇప్పటి వరకు 1,67,721 మంది రైతులకు రూ.215 కోట్ల 15 లక్షలు జమ అయ్యాయని తెలిపారు. రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని, వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో ఈ పంపిణీ సమర్థవంతంగా కొనసాగుతోందని తెలిపారు. రైతుభరోసా పథకం కేవలం ఆర్థిక సాయమే కాకుండా రైతుల భవిష్యత్పై ఆశను నింపే విధంగా తోడ్పడుతుందని తెలిపారు. వానాకాలం పంటల సాగుకోసం అవసరమైన పెట్టుబడి భారం నుంచి రైతులకు విముక్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేసిన ఈ నగదును రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
శుభ్రతతోనే
సంపూర్ణ ఆరోగ్యం
కోస్గి రూరల్: ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్లనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని మున్సిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు. 100 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం పట్టణంలోని 10వ వార్డులో తడి–పొడి చెత్తపై ఇంటింటా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తడి , పొడి చెత్తను వేర్వేరు బుట్టలలో వేయాలని, తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయవచ్చని సూచించారు. వస్తువుల వినియోగానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి బట్ట సంచులను వాడాలన్నారు. అమృత్జల్ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. అనంతరం పట్టణంలోని నాగులబావి సమీపంలో మెప్మా సిబ్బంది ఆధ్వర్యంలో ఎర్పాటు చేసిన పండ్ల స్టాల్, ఫుడ్ స్టాల్లను కమిషనర్ సందర్శించారు. గ్రామీణ వంటకాల రుచులు ఎంతగానో బాగున్నాయని వారిని ఆభినందించారు. కార్యక్రమంలో మేనేజర్ అనిల్కుమార్ , హెల్త్అసిస్టెంట్ మొహిన్బాషా,రాస్నం బాల్రాజ్ మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
మత్తు పదార్థాలతో జీవితం అంధకారం
నారాయణపేట: మత్తు పదార్థాలతో జీవితం అంధకారమవుతుందని, ముఖ్యంగా యువత వీటికి దూరంగా ఉండాలని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ బుచ్చయ్య, స్థానిక డీఎస్పీ లింగయ్య విద్యార్థులకు సూచించారు. ‘నషా ముక్త్ భారత్,యాంటీ డ్రగ్ దినోత్సవం జూన్ 26 ఉన్నందున యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులకు సదస్సు నిర్వహించారు. డీఎస్పీలు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటికి దూరంగా ఉంటారన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన, సరఫరా చేసిన, సేవించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతను లక్ష్యంగా చేసుకొని కొందరు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతూ వారిని బానిసలుగా మారుస్తు భవిష్యత్తు నాశనం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధికారులతో కలిసి మాదక ద్రవ్యాలు, గంజాయి వాడకంపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఐయామ్ ఆన్ యాంటీ డ్రగ్ సోల్జర్ గా సుమారు 180 మంది విద్యార్థులను ఎన్రోల్ చేయడం జరిగిందని డీఎస్పి తెలిపారు.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు