
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నారాయణపేట: మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఒక అద్భుతమైన సాధనం యోగా అని, నిత్యం యోగ సాధన ద్వారా మన జీవనశైలిని మెరుగుపరుచుకోవచ్చని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతాంజలి యోగా సమితి– భారత స్వాభిమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం–2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తదితరులు హాజరై యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు ఎన్నో దేశాలలో యోగా దినోత్సవం జరుపుకోడం ద్వారా యోగాకు నిత్య జీవితంలో ఉన్న ప్రాధాన్యత తెలియజేస్తుందన్నారు. ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులకు చదువుతో పాటు యోగా చేయించాలన్నారు. యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానం అన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిదని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యోగా జీవన విధానంలో మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. యోగాను ప్రతిరోజు ఉదయం తప్పకుండా ఒక ఉద్యమంలో చేస్తే అందరి ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అలాగే ఆచరించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, బిజెపి రాష్ట్ర నేత నాగురావు నామాజీ, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి, డీఎంహెచ్ఓ జయ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ పాల్గొన్నారు.
ఆయుష్సు పెంపు..
ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడంతో ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని జిల్లా న్యాయ సేవా అధికార ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాస్ అన్నారు. కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ వింధ్య నాయక్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉదయం కొంత సమయాన్ని కేటాయిస్తూ యోగా ఆసనాలు వేయాలని, వ్యాధులు దరి చేరకుండా ఆరోగ్యకరంగా ఉంటారన్నారు.
ఒత్తిడి దూరం
పోలీసులు ఒత్తిడిని తట్టుకోవడానికి ప్రతిరోజు యోగా, ధ్యానం సమయం దొరికినప్పుడు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. మొదటగా యోగా శిక్షకుడు కుమ్మరి నర్సింలు యోగాను సిబ్బందికి తెలియజేస్తూ, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ఆసనాలు చేయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. యోగా అనేది వయస్సుకు సంబంధం లేకుండా అందరూ చేసే ఒక సాధన అని, గుండెకు, శరీరానికి, మనసు ప్రశాంతతకు యోగా ఆసనాలు ఉపయోగపడతాయన్నారు. ఏఎస్పి రియాజ్ హూల్ హక్, డీఎస్పీ లు ఎన్ లింగయ్య, మహేష్, సిఐ నరసింహ, సిఐ శివ శంకర్ పాల్గొన్నారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్
జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం