
మురిసిన పెద్దధన్వాడ
రాజోళి: ఇథనాల్ చిచ్చు వద్దంటూ పోరాడిన రైతుల లోగిళ్లలో పచ్చ తోరణాలు గడపలకు పెనవేసుకున్నాయి. గురువారం రాజోళి మండలం పెద్దధన్వాడలో ఏరువాక సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తున్న రైతులు, 12 గ్రామాల ప్రజలు ఈ నెల 4న పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ వద్దని తమ గొంతుకను వినిపించేందుకు వెళ్లిన నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటనలు విధితమే. దీంతో 42 మందిపై కేసు నమోదు కాగా..12 మంది రైతులను 5వ తేదీన రిమాండ్కు తరలించారు. రైతులంతా ఉంటేనే పండుగ చేసుకోవాలంటూ.. ఈ నెల 11న చేసుకోవాల్సిన ఏరువాక పౌర్ణమి పండుగను గ్రామస్తులంతా బహిష్కరించారు. తాజాగా బుధవారం బెయిల్ మంజూరు కావడంతో గురువారం పండుగ నిర్వహించారు. ఉదయం నుండే మహిళలు ఇళ్ల ముందు ముగ్గులు, వాకిళ్లను తోరణాలతో అలంకరించారు. రైతులు తమ ఎద్దులకు స్నానాలు చేయించి, అందంగా అలంకరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం సాగాలని ప్రత్యేకంగా పూజలు చేశారు. కుటుంబసభ్యులు అందరూ కలిసి సుంకులమ్మ తల్లి దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. అనుకోకుండా జరిగిన పరిణామాల కారణంగా సాగు ఆలస్యమైంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ప్రత్యేక పూజలు చేశారు.