
దరఖాస్తు చేసుకోండి
నారాయణపేట: జిల్లాలోని నిరుద్యోగ యువతకు టీజీఏబీసీడీసీ ఆధ్వర్యంలో పలు అంశాలపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కిల్ కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ ఫౌండేషన్, మాక్ ఇంటర్వ్యూలు, మెంటల్ వెల్నెస్ ట్రైనింగ్ అంశాలపై నాలుగు రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. 21 నుంచి 30 ఏళ్ల వయసు కలిగి, ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా tgobmms.cgg.gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఇతర ధ్రువపత్రాలను జిల్లా బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో 14వ తేదీలోగా అందజేయాలని తెలిపారు.
మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
కోస్గి రూరల్: మైనార్టీల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని ముశ్రీఫా గ్రామంలో మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అందించే కుట్టుమిషన్లకు 55 మంది దరఖాస్తు చేసుకోగా.. 44మందికి మంజూరైనట్లు తెలిపారు. మిగతా వారికి 10 రోజుల్లో మంజూరవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు సమప్రాధాన్యం ఇస్తూ పథకాలను అమలు చేస్తుందని.. అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తూం భీంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గిరిప్రసాద్రెడ్డి, మహిపాల్రెడ్డి, సుధాకర్గౌడ్, శశివర్ధన్, రామకృష్ణారెడ్డి, హబిబ్ పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలకు
కాంగ్రెస్ కసరత్తు
స్టేషన్ మహబూబ్నగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో సత్తా చాటడానికి పార్టీ సన్నద్ధమవుతోంది. తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ ఆమోదం మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ సోమవారం ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్చార్జ్లను నియమించారు. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్గా పార్టీ సీనియర్ నాయకుడు, పీఏసీ సభ్యుడు జె.కుసుమకుమార్ నియామకమరు. ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ కీలకపాత్ర పోషించనున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు..
రాష్ట్రంలోని వివిధ ఉమ్మడి జిల్లాలకు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు ఇన్చార్జ్లుగా నియామకం అయ్యారు. ఇందులో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రెడ్డి ఖమ్మం, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్కుమార్ నల్లగొండ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ కె.శివసేనారెడ్డి రంగారెడ్డి జిల్లాలకు ఇన్చార్జీగా నియమితులయ్యారు.
పనిగంటల పెంపు
జీఓను రద్దు చేయాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: ఎనిమిది గంటల పనికి బదులు 10 గంటల పని సమయం పెంచుతూ రాష్ట్ర కార్మిక శాఖ దొడ్డిదారిన తెచ్చిన జీఓ నం.282ను తక్షణమే రద్దు చేయాలని వామపక్ష కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జీఓ నం.282పై వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జీఓ 282 ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సురేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్, టీఎన్టీయూ జిల్లా నాయకుడు రాములు మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కాంగ్రెస్ మద్దతు ఇస్తూనే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దొడ్డిదారిన కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా 10 గంటల పనివేళలు పెంచుతూ జీఓ జారీ చేయడం దుర్మార్గమని అన్నారు.

దరఖాస్తు చేసుకోండి