● శ్రీశైలం మండలంలో మితిమీరుతున్న
టీడీపీ నాయకుడి ఆగడాలు
● పీజేఆర్ఎస్లో ఎస్పీకి
ఫిర్యాదు చేసిన మహిళ
సాక్షి, టాస్క్ఫోర్స్: శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అనుచరులు చేస్తున్న ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. ఓ స్థలం విషయంలో రూ.లక్ష తీసుకుని తనని మోసం చేశాడని తాజాగా సున్నిపెంట గ్రామంలో నిర్వహించిన పీజేఆర్ఎస్లో ఏకంగా శ్రీశైల మండల టీడీపీ ప్రధాన నాయకుడిపై ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ పార్టీ నాయకులే విస్మయానికి గురయ్యారు. తన వద్దకు సమస్యలపై వచ్చేవారికి టీడీపీ ఇన్చార్జ్కి, స్టేషన్లో ఓ అధికారికి డబ్బు ఇవ్వాలని ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి డబ్బు వసూలు చేస్తాడని సమాచారం. అతని ఆగడాలు సున్నిపెంటలో శృతిమించుతున్నట్లు ఎమ్మెల్యేకు ఫిర్యాదులు సైతం వెల్లువెత్తినట్లు సమాచారం.
ఎమ్మెల్యేతో దిగిన ఫొటోలే పెట్టుబడి..
శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అండదండలతో శ్రీశైలం మండలంలో ద్వితీ యశ్రేణి నాయకులు చేస్తున్న ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారిని టార్గెట్ చేసుకుని ఒక్కోపనికి ఒక్కో రేటు కట్టి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే స్థానిక పర్యటనలకు వచ్చినప్పుడు ఆయనతో చనువుగా ఉన్నట్లు వ్యవహరిస్తూ దిగిన ఫొటోలను, వీడియోలను స్టేటస్లలో పెట్టుకుని ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఉద్యోగాలు, స్థలాలు, ఇరిగేషన్, గృహాలు, విద్యుత్ తదితర సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఓ స్థలం తనకు ఇప్పిస్తానని రూ.లక్ష తీసుకుని స్థలం ఇప్పించకుండా, డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ మహిళ జిల్లా ఎస్పీకి ఇటీవల ఫిర్యాదు చేశారు.
● తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ పేరుచెప్పి కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి.
● పూర్ణానంద ఆమం సమీపంలో ఓ ఇంటి విషయంలో ఒకరికి మద్దతు తెలిపి వారి నుంచి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
● ఇటీవల ఓ వడ్డీ వ్యాపారి, మరో యువకుడు గొడవ పడి స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయంలో రాజీ చేస్తానని ఇద్దరి నుంచీ డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. వసూలు చేసింది కాదని స్టేషన్ అధికారికి, మండల టీడీపీ ఇన్ చార్జ్కి మరో రూ.50 వేలు ఇవ్వాలని పట్టుబట్టడంతో తాము అంత ఇచ్చుకోలేమని వారు నేరు గా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


