సాక్షిటాస్క్ ఫోర్స్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభకు టీడీపీ నాయకులు కష్టపడి వాహనాల్లో ప్రజలను తరలించినా స్పందన కరువైంది. గురువారం బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ (మీ భూమి .. మీ హక్కు) కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సభకు పొదుపు మహిళలు, ఉపాధి కూలీలను బస్సుల్లో తరలించారు. అలాగే ఉపాధి కూలీలు ఉదయం పని చేసే ప్రాంతానికి తీసుకెళ్లి ఫొటోలు దిగి హాజరు వేయించుకొని పని చేయకుండానే సంబంధింత అధికారులు వారిని సీఎం సభకు తరలించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో సభలో ప్రజల నుంచి సరైన స్పందన లేక పోవడంతో ప్రజలను అడిగి.. అడిగి చప్పట్లు కొట్టించుకోవడం కనిపించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తుండగా ప్రజల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. తాను ప్రజల కోసం ఇంతగా తపన పడుతుండగా ‘మీ నుంచి ఆదే స్థాయిలో ప్రభుత్వానికి ఆదరణ లభించాలి’ అని చంద్రబాబు కోరినా ప్రజలు మౌనంగానే ఉన్నారు. కాగా చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఓ మహిళా తన సమస్యను చెప్పుకునేందుకు ప్రయత్నించగా సీఎం చంద్రబాబు ఆవేశానికి గురై ఆమైపె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. జిల్లాలో పని చేసే పలు శాఖల అధికారుల పని తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులను స్టేజీ వద్దకు పిలిపించి ర్యాంకులు వివరాల వెల్లడిస్తూ కొందరి అధికారుల పని తీరు మార్చుకోవాలని పేర్కొనడంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు.
సభకు బస్సులు..
బస్టాండ్లో ప్రయాణికులు
సీఎం పర్యటన కోసం గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను కేటాయించారు. సభ ప్రారంభం నుంచి ముగిసే వరకు సుమారు 6 గంటల పాటు ఆర్టీసీ బస్సులు బనగానపల్లె బస్టాండ్కు రాకుండా నిర్దేశించిన ప్రాంతాల నుంచి బయటకు వెళ్లిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు లు పడ్డారు. ఏ బస్సు ఎటు వెళ్తుందో తెలియక కొందరు ప్రయాణికులు అగచాట్లు పడ్డారు.
సీఎం చంద్రబాబునాయుడు సభకు
స్పందన కరువు
అడిగి మరీ చప్పట్లు కొట్టించిన సీఎం
సమస్య వివరిస్తున్న మహిళను
సభ నుంచి గెంటేసిన పోలీసులు
సీఎం పర్యటనలో నియోజకవర్గానికి
వరాలు శూన్యం
మందుబాబులకు పండగ..
సీఎం సభ మందుబాబులకు పండగగా మారింది. బనగానపల్లె పట్టణంలో వైన్షాపులు కిక్కిరిసిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని మందు సేవించడం పలువురుకి ఇబ్బంది కలిగించింది. సీఎం పర్యటనకు వెళ్లే సమయంలో ఆయా గ్రామాల టీడీపీ నాయకులు ఇచ్చే మందు చాలక బస్సు దిగిన తరువాత మళ్లీ మందు ఇవ్వడంతో కిక్కు ఎక్కువై చాలా మంది కిందపడిపోయారు.


