మాది ఉమ్మడి కుటుంబం. మాకు 10 ఎకరాల భూమి ఉంది. నల్లరేగడి నేలలు కావడంతో జూన్ రెండో వారం తర్వాత పత్తి సాగు చేశాం. ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి వచ్చింది. బస్తా ఎరువు రూ.2500 వరకు ఉంటోంది. వర్షాలు లేక కళ్లెదుటనే పత్తి పంట ఎండిపోయింది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– లక్ష్మన్న, మూగలదొడ్డి, కోసిగి మండలం
మాకు 15 ఎకరాల పొలం ఉంది. మామూలుగా అయితే పత్తి సాగు చేస్తాం. ఈ సారి ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పడంతో ఎనిమిది ఎకరాల్లో కంది వేశాం. విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఒక్క వాన కూడా పడలేదు. పంట మొత్తం ఎండిపోయింది. మరో ఏడు ఎకరాల్లో విత్తనం వేయలేదు. గతంలో ఎపుడూ లేని విధంగా కరువు వచ్చింది.
– డి.మధుసూదన్రెడ్డి, ఆస్పరి
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఖరీఫ్ సీజన్ దెబ్బతినింది. వేరుశనగ, ఆముదం సాగు చేసి నష్టాలు మూట కట్టుకున్నాం. నేను 4.50 ఎకరాల్లో వేరుశనగ, రెండున్నర ఎకరాల్లో ఆముదం సాగు చేశా. నెల రోజులుగా చినుకు జాడ లేకుండా పోయింది. మొత్తంగా రూ.లక్షకు పైగా నష్టం వచ్చింది. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసినప్పటికీ పంటలు కోలుకునే అవకాశం లేకుండా పోయింది.
– నాగలాపురం రాముడు,
చుంచుఎర్రగుడి గ్రామం, కృష్ణగిరి మండలం


