బనగానపల్లె: రబీలో షుగర్ లెస్ సాగు చేసిన రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. గిట్టుబాటు ధర లభించకపోవడంతో పెట్టుబడులు కూడా చేతికందని పరిస్థితి నెలకొంది. దళారులు లాభాలు పొందుతూ రైతులను అప్పులపాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎస్సార్బీసీ, అవుకు రిజర్వాయర్ ఆయకట్టు, వ్యవసాయబోర్ల కింద రైతులు రబీలో సుమారు 15 వేల హెక్టర్లలో షుగర్లెస్, 1010 రకాల వరి సాగు చేశారు. ఇందులో ఎక్కువశాతం షుగర్లెస్ ఉంది. ఈ పంటకు మంచి డిమాండ్ ఉన్నందుననే గత రెండేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. పంట చేతికొచ్చే తరుణంలో గిట్టుబాటు ధర దక్కడం లేదు. 20 రోజుల క్రితం 75 కిలోల బస్తా రూ.1,800 ధర ఉండగా ప్రైవేట్ వ్యాపారులు సిండికెట్గా మారడంతో రూ.1,550కి మించడం లేదు. పెట్టుబడి అధికంగా ఉండటం, దిగుబడి మాత్రం 28–30 బస్తాలకు మించకపోవడంతో రైతులకు నష్టాలు మిగులుతున్నాయి. కౌలు రైతులు మరింత అప్పులపాలయ్యారు.
షుగర్లెస్ ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ పంటను దళారులు కొనుగోలు చేస్తున్నారు. పంట కల్లాలో చేరే సమయంలో వ్యాపారులు సిండికేట్గా మారడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. షుగర్లెస్ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
– వెంకటేశ్వర్లు రైతు,
కాపులపల్లి బనగానపల్లె మండలం


