నందికొట్కూరు: నేరం చేసిన వారికి శిక్ష పడేలా దర్యాప్తు నిర్వహించి పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకాన్ని పెంపొందించాలని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. నందికొట్కూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణలో. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు యువత బానిసలుగా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులు పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ రామాంజనేయులు నాయక్, సీఐలు సుబ్రమణ్యం, ప్రవీణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
నంద్యాల(న్యూటౌన్): కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా పీఆర్సీ నియమించకపోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యా యులు ధర్నా చేశారు. ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య మాట్లాడుతూ మధ్యంతర భృతి 30 శాతం, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు, 2022 నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలు, 2003 డీఎస్సీ ఉపా ధ్యాయులకు మెమో నం.57ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కేజీబీవీలో ఉపాధ్యాయులకు ఎంఈటీఎస్ విధానాన్ని అమలు చేసి, మున్సిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాకీర్హుసేన్, దస్తగిరి బాషా, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, నూరుల్లా, నౌమాన్బాషా పాల్గొన్నారు.


