ఉమ్మడి జిల్లా ఉక్కిరిబిక్కిరి
నిర్మానుష్యంగా కర్నూలులోని
కొండారెడ్డి బురుజు ప్రాంతం
కర్నూలు(అగ్రికల్చర్): ఎండలు, వడగాలుల తీవ్రత ఉమ్మడి జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ కారణంగా విద్యుత్ వినియోగం కూడా అధికమైంది. బయట తిరగడం పక్కనపెడితే.. ఇంట్లో ఫ్యాన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతల తీవ్రతకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం తిరుగుతుండటంతో విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 2.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగిందంటే ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్ మూడవ వారంలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. నంద్యాల జిల్లా సంజామల మండలంలో హీట్వేవ్ కొనసాగుతోంది. సంజామలలో ఈ నెల 16న ఉష్ణోగ్రత 45.1 డిగ్రీలు నమోదైంది. 17న 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం గమనార్హం. ఎండల తీవ్రతతో ఈ మండలం అగ్నిగుండాన్ని తలపిస్తోంది.
183 చలివేంద్రాలు ఏర్పాటు చేశారట!
ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నా.. పాదచారులకు తగిన ఉపశమన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఇబ్బంది పడరాదనే ఉద్దేశంతో ఎరువులు, పురుగుమందులు, విత్తన షాపుల ఎదుట చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఎండలు, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నా.. చలి వేంద్రాలు, చలువ పందిళ్లు వేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని చాటుకుంటోంది. జిల్లా మొత్తం మీద ప్రభుత్వం, లోకల్ బాడీస్, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిపి 183 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు లెక్కలు ఉన్నాయి. ఇందులో 10 శాతం వరకు పనిచేయడం లేదు. చలివేంద్రాల ఏర్పాటులో అంకెలగారిడీ ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కర్నూలు నగరంలోని 9 పాంత్రాల్లో 12 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, గూడూరు వంటి పట్టణాల్లో చలువ పందిళ్ల జాడ లేకపోవడం గమనార్హం.
మండలం ఉష్ణోగ్రత
ఆళ్లగడ్డ 44.5
బనగానపల్లి 43.7
రుద్రవరం 43.7
కొత్తపల్లి 43.6
కోడుమూరు 43.6
వెల్దుర్తి 43.6
మంత్రాలయం 43.5
నంద్యాల రూరల్ 43.5
చాగలమర్రి 43.4
కర్నూలు 43.4
ఉయ్యాలవాడ 43.3
కోవెలకుంట్ల 43.3
గూడూరు 43.1
దొర్నిపాడు 43.1
కల్లూరు 43.1
చిప్పగిరి 43
మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
రానున్న రోజుల్లో పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. రాష్ట్రంలోనే అత్యధిక ఎండలు, వడగాలుల తీవ్రత నంద్యాల జిల్లాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట తిరగరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. ఈ సారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 48 నుంచి 50 డిగ్రీలకు చేరే ప్రమాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
సంజమల మండలంలో
కొనసాగుతున్న హీట్వేవ్
రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
సంజామలలో 44.8..
ఆళ్లగడ్డలో 44.4 డిగ్రీలు నమోదు
అధికమైన విద్యుత్ వినియోగం
గిర్రున తిరుగుతున్న విద్యుత్ మీటర్లు
0


