రెండేళ్లవుతున్నా ఆడబిడ్డ నిధి ఊసే లేదు పొదుపు మహిళలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు
బేతంచెర్ల: అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, గిడ్డంగుల శాఖ మాజీ డైరెక్టర్ బాబురెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు చెందిన పొదుపు గ్రూపుల మహిళలు, తొలగించిన (వీఓఏ) బుక్ కీపర్లు మాజీ మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. అధికార పార్టీ నాయకుల మాటలు విని వెలుగు ఏపీఎంలు తమని అన్యాయంగా తొలగిస్తున్నారని చెప్పారు. ఆలాగే బ్యాంకులు తమకు రుణాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకుల సిఫారసుతో నియమితులైన వీఓఏల దగ్గరకు వెళ్లలేదని కారణంతో ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ బాధ్యతగా పనిచేస్తున్న బుక్ కీపర్లను తొలగించడం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయ నాయకుల మాటలు విని వారి మెప్పు కోసం బుక్ కీపర్లను అక్రమంగా తొలగిస్తే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పొదుపు మహిళలు, వీఓఏలు ఐక్యంగా ఉండి అధికారులు నిబంధనలు పాటించకపోతే నిలదీయాలన్నారు. మీకు అండగా మేము ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. రెండు సంవత్సరాల టీడీపీ పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీ సక్రమంగా అమలుకు నోచుకోలేదన్నారు. నమ్మించి మోసం చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు.
మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి


