సాక్షి, నంద్యాల: ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో పరిష్కరించిన కొన్ని గ్రీవెన్సులు మళ్లీ రీఓపెన్ అవుతున్నాయని, అలాంటి వాటిని అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలన్నారు. నేడు జరిగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలకు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఇటీవల బేతంచెర్ల మండలంలోని కృష్ణాపురం గ్రామ సచివాలయాన్ని సందర్శించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నట్లు తెలిపారు. కొన్ని శాఖల సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతుందన్నారు. విద్యుత్ సదుపాయాల కల్పనలో జాప్యం జరగకుండా సమన్వయంతో పని చేయాలన్నారు. వినతులకు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపేందుకు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కేసీ కాలువ, తెలుగు గంగ మరమ్మతు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్,డీఆర్ఓ రాము నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పీజీఆర్ఎస్లో అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం


