ఆత్మకూరు రూరల్: మండలంలోని సిద్దాపురం చెరువు సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. మండలంలోని సంజీవనగర తండాకు చెందిన నాగేశ్వరికి ఇద్దరు కుమారులు. చిన్నవాడైన అభిలాష్ (16)కు కుటుంబ సభ్యులు ఇటీవల కొత్త ద్విచక్రవాహనం కొనుగోలు చేశారు. ఆ వాహనంపై అభిలాష్ బైర్లూటి వెళ్లి వస్తుండగా సిద్దాపురం చెరువు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. స్థానికులు గమనించి తీవ్రంగా గాయపడిన బాలుడి సమాచారం కుటుంబ సభ్యులకు ఇచ్చారు. వారు ఆ బాలుడిని చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో అభిలాష్ కోలుకోలేక సోమవారం మరణించాడు.
గొర్రెలను తప్పించబోయి..
కొత్తపల్లి: విధులకు మోటారు బైకుపై వెళ్తుండగా మార్గ మధ్యంలో ఎదురుగా వస్తున్న గొర్రెలను తప్పించ బోయి ఇద్దరు ఉపాధ్యాయులు కిందపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. శివపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఖాజా మొహిద్దీన్, షహిన్ షా అనే ఉపాధ్యాయులు సోమవారం ఉదయం ద్విచక్రవానంపై ఆత్మకూరు వైపు నుంచి బయలుదేరారు. శివపురం గ్రామ శివారులోని జమ్ములమ్మ గుడి సమీపంలో రోడ్డుపై ఎదురయ్యాయి. వాటిని తప్పించే క్రమంలో బైకు అదుపుతప్పడంతో కింద పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఖాజా మోహిద్దీన్ పరిస్థితి విషయంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు.
ఖాళీ పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): సమగ్రశిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు జిల్లా కో ఆర్డినేటర్ నిత్యానందరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసిస్టెంట్ స్టాస్టికల్ ఆఫీసర్, ప్రోగ్రాం ఆఫీసర్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఉర్దూ), గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న వారు మాత్రమే అర్హులని, స్కూల్ అసిస్టెంట్లకు కనీసం 5 సంవత్సరాలు, సెకండ్ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)కు కనీసం 8 ఏళ్ల అనుభవం ఉండాలన్నారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 15 నుంచి 20లోగా సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలన్నారు.


